దర్వాజ-హైదరాబాద్
New virus in Hyderabad : తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ పై మరో కొత్త వైరస్ అటాక్ చేస్తోంది. ఇటీవలి కాలంలో ఈ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతూనే ఉన్నాయి. ఈ వైరస్ బాధిత కేసులు రోజుకు వందకు పైనే నమోదవుతున్నాయి. దీంతో అరోగ్య శాఖ ఆందోళన వ్యక్తం చేస్తోంది. ప్రజల్లోనూ భయందోళనలు మొదలయ్యాయి. అదే నోరోవైరస్. నోరోవైరస్ ఇన్ఫెక్షన్లలో గణనీయమైన పెరుగుదల కారణంతో పాటు ఇది అంటువ్యాధి కావడంతో మరో హెల్త్ ఎమర్జెన్సీ రానుందా? అనే ఆందోళనలు మొదలయ్యాయి. ఈ అంటువ్యాధి జీర్ణశయాంతర అనారోగ్య స్థాయిని క్రమంగా పెంచుతుంది. నగర నివాసితులను తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. హైదరాబాద్ సిటీలోని అంతటా ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలను ప్రభావితం చేస్తోంది.
పాతబస్తీలో మరీ ముఖ్యంగా దబీర్పురా, యాకుత్పురా, పురానీ హవేలీ, మొఘల్పురా, మలక్పేట్ తదితర ప్రాంతాల్లో నోరోవైరస్ ఇన్ఫెక్షన్ కేసులు చాలా అధికంగా నమోదయ్యాయి. గత సంవత్సరాల్లో వేసవి, వర్షాకాలంలో కొన్ని కేసులు నమోదయ్యాయి కానీ, ఈ సంవత్సరం నోరో వైరస్ కేసుల సంఖ్య చాలా పెరిగిందతి. చాలా ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రైవేట్ క్లినిక్లు రోగులతో నిండిపోన పరిస్థితులు కనిపిస్తున్నాయి. హైదరాబాద్ నగరంలోనే కాకుండా దాని పరిసతర ప్రాంతాల్లో కూడా నోరో వైరస్ కేసులను గుర్తించినట్టు పలు రిపోర్టులు పేర్కొంటున్నాయి.
చాలా మంది అధిక జ్వరం, తీవ్రమైన పొట్ట నొప్పి, కడుపులో పుండ్లు, కడుపు ఉబ్బరం, నిర్జలీకరణ సమస్యలను ఎదుర్కొంటున్నట్టు చెప్పారు. అలాగే, చాలా మంది రోగులు కూడా తీవ్రమైన హైపోటెన్షన్ (తక్కువ రక్తపోటు), మూత్రపిండాల వైఫల్యంతో అత్యవసర పరిస్థితులను ఎదుర్కొంటున్నారు.

పాతబస్తీలో రోజుకు 100కు పైగా నోరోవైరస్ కేసులు..
పాతబస్తీలో రోజుకు 100 కు పైగా కేసులు నమోదైన పరిస్థితులు ఉన్నాయని వైద్య నివేదికలు పేర్కొంటున్నాయి. వీరిలో చాలా మంది రోగులు వెంటిలేటర్ పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. “మేము రోగులు తీసుకుంటున్న ఆహారం, నీరు గురించిన వివరాలు తెలుసుకున్నప్పుడు కీలక విషయాలు ఉన్నాయి. వారు తీసుకునే ఆహారం లేదా నీరు పెద్ద ఎత్తున కలుషితం కావడం వల్ల జరిగివుండవచ్చునని” పీడియాట్రిక్ సర్జన్ డాక్టర్ జిఎమ్ ఇర్ఫాన్ తెలిపినట్టు టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదికలు పేర్కొన్నాయి.
గత మూడు వారాలుగా ప్రతిరోజూ 100-120 కేసులు చూస్తున్నారు. “రోగుల రక్తపోటు 90/40, 70/40 కంటే తక్కువగా ఉంటుంది. ఫలితంగా, వారిలో చాలా మంది సాధారణ స్థితికి రావడానికి రెండు మూడు రోజులు ఆసుపత్రిలో ఉండాల్సిన పరిస్థితులు ఉన్నాయని” వైద్యులు చెబుతున్నారు. అలాగే, తీవ్రమైన హైపోటెన్షన్, శ్వాసకోశ ఇబ్బంది ఉన్న కొంతమంది రోగులకు వెంటిలేటర్లపై ఉంచడం జరుగుతుందని నిపుణులు అంటున్నారు.
“నోరో వైరస్ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. పాతబస్తీలో పెద్ద ఎత్తున నీరు కలుషితం అవుతున్నట్లు ఇది సూచిస్తుంది. మాకు డయాలసిస్ సపోర్ట్ అవసరమయ్యే అనేక కిడ్నీ ఫెయిల్యూర్ (డీహైడ్రేషన్ కారణంగా), ఐనోట్రోపిక్ సపోర్ట్ అవసరమయ్యే తీవ్రమైన హైపోటెన్షన్ కేసులు, మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ కేసులు కూడా వెంటిలేటర్ సపోర్ట్ అవసరమని మేము చూస్తున్నాము” అని ప్రిన్సెస్ దుర్రు షెహ్వార్ హాస్పిటల్ జనరల్ ప్రాక్టీషనర్ డాక్టర్ ఎంఎ వహాబ్ జుబైర్ చెప్పినట్టు సంబంధిత నివేదికలు పేర్కొన్నాయి.
