దర్వాజ – హైదరాబాద్
తెలంగాణ ప్రభుత్వం పద్మశ్రీ అవార్డు గ్రహీతలకు గుడ్ న్యూస్ చెప్పింది. వారికి నెలవారి పింఛన్ గా 25 వేల రూపాయలను అందించేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా తమ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చేందుకు ముందుకు సాగుతున్నదని మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు.
ప్రభుత్వం ఒక ప్రకటనలో.. తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ నిలబెట్టుకుంటున్నారనీ, పద్మశ్రీ అవార్డులు ప్రకటంచగానే శిల్పరామం లో ఘనంగా సత్కరించిన విషయాన్ని ప్రస్తావిస్తూ.. ఇటీవలే పద్మశ్రీ గ్రహీతలకు ఒక్కొక్కరికి 25 లక్షలు రూపాయల నజరానా అందించగా, ప్రతి నెలా 25 వేల రూపాయలు పింఛనుకు సంబంధించి సోమవారం జివో విడుదల చేశారు. ఇక నుంచి ప్రతి నెల 25 వేల రూపాయల గౌరవ పెన్షన్ అందుతుందని సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు.
కనుమరుగవుతున్న కళలను గుర్తించి, వాటిని భవిష్యత్తు తరాలకు అందించే కళాకారులను ప్రోత్సహించేందుకు సీఎం రేంవత్ రెడ్డి సారధ్యంలోని ప్రజా ప్రభుత్వం కృషి చేస్తుందని పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. అందులో భాగంగా ఇటీవలే పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్న గడ్డం సమ్మయ్య, దాసరి కొండప్ప తదితరులకు ప్రతీ నెల25 వేల రూపాయల ప్రత్యేక పింఛన్ మంజూరు చేస్తూ జీవో జారీ చేసినట్లు వివరించారు. ఇక నుంచి సాంస్కృతిక శాఖ ద్వారా పింఛన్ డబ్బులు నేరుగా వారి ఖాతాల్లో జమ అవుతాయన్నారు.