ఆఫ్ఘన్ లో భారత ఫొటో జర్నలిస్టు మృతి
దర్వాజ-అంతర్జాతీయం
ప్రస్తుతం ఆఫ్ఘనిస్థాన్-తాలిబన్ల మధ్య తీవ్ర పోరు నడుస్తోంది. ఈ క్రమంలోనే కాందహార్లోని స్పిన్ బోల్డక్ జిల్లాలో ప్రభుత్వ దళాలు, తాలిబన్ల మధ్య జరుగుతున్న ఘర్షణకు సంబంధించిన దృశ్యాలను చిత్రీకరించేందుకు ఆఫ్ఘన్ దళాలతో కలసి వెళ్లిన భారత ఫొటో జర్నలిస్టు, పులిట్జర్ అవార్డు గ్రహీత డానిష్ సిద్ధిఖీ ప్రాణాలు కోల్పోయారు. ఆఫ్ఘాన్ లోని భారత రాయబారి ఫరీద్ ముముండ్ జే ట్విట్టర్ ద్వారా ఈ విషయాన్ని తెలియజేశారు.
దేశ ఆర్థిక రాజధాని ముంబయికి చెందిన సిద్ధిఖీ.. ఢిల్లీలోని జామియా మిలియా యూనివర్సిటీ నుంచి 2007లో మాస్ కమ్యూనికేషన్స్లో డిగ్రీ పూర్తిచేశారు. అనంతరం ఓ న్యూస్ చానల్లో కరస్పాండెంట్గా కెరియర్ను ప్రారంభించిన ఆయన రాయిటర్స్ లో ఫొటో జర్నలిస్టుగా చేరారు. రోహింగ్యా శరణార్థులపై తీసిన ఫొటోలకుగాను ప్రతిష్ఠాత్మక పులిట్జర్ అవార్డును సైతం ఆయన అందుకున్నారు. కాగా, ఆయన మృతికి భారత్ సంతాపం ప్రకటిస్తూ.. కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేసింది.
Share this content: