ఆన్లైన్ క్లాసులు.. అధిక ఫీజులు
- 20 శాతం పెరిగిన స్కూల్ ఫీజులు
- నిలువరించడంలో ప్రభుత్వాల అలసత్వం..
- ఆందోళనలో తల్లిదండ్రులు : లోకల్ సర్కిల్ సర్వే
దర్వాజ-న్యూఢిల్లీ
Local Circles survey: ఏడాది కాలంగా ఆన్లైన్ తరగతులు కోనసాగుతున్నప్పటికీ.. తమ పిల్లల పాఠశాల ఫీజులు పెరిగాయంటూ 63 శాతం తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తంచేశారని తాజాగా ఓ సర్వే పేర్కొంది. పాఠశాల ఫీజులకు సంబంధించి సోషల్ మీడియా కమ్యూనిటీ ప్లాట్ఫామ్ ‘లోకల్ సర్కిల్’ ఈ సర్వేను చేపట్టింది. ఈ సర్వే వివరాల ప్రకారం.. ఆన్లైన్ తరగతుల కొనసాగుతున్నప్పటికీ తమ పిల్లల స్కూల్ ఫీజులు పెరిగినట్టు 63 శాతం మంది తల్లిదండ్రులు తెలిపారు.
2021-22 విద్యా సంవత్సరానికి ఫీజులను పాఠశాలలు 20 శాతాని పైగా పెంచినట్టు 33 శాతం మంది వెల్లడిరచారు. 23 శాతం మంది ఫీజుల పెరుగుదల 10 నుంచి 20 శాతంగా ఉందని చెప్పారు. 10 శాతం ఫీజుల పెరుగుదల ఉందని 7 శాతం తల్లిదండ్రులు తెలిపారు. అయితే, 2020-21 నుంచి 10 నుంచి 20 శాతం ఫీజులు తగ్గినట్టు ఒక శాతం తల్లిదండ్రులు మాత్రమే చెప్పడం గమనార్హం. ఇదే కాలంలో 20 శాతానికి పైగా ఫీజులు తగ్గించినట్టు 2 శాతం మంది తెలిపారు.
లోకల్ సర్కిల్ ఈ సర్వేను దేశంలోని 302 జిల్లాలో నిర్వహించింది. ఇందులో 26,000లకు పైగా ప్రతిస్పందనలు వచ్చాయి. టైర్1 ప్రాంతాల (మెట్రో) నుంచి 48 శాతం ప్రతిస్పందనలు, టైర్2 ప్రాంతాల నుంచి 28 శాతం, టైర్ 3, 4, గ్రామీణ ప్రాంతాల నుంచి 24 శాతం ప్రతిస్పందనలు వచ్చాయి. అయితే, ఇటీవల ఆన్లైన్ తరగతుల కారణంగా పాఠశాలల నిర్వహణకు సంబందించి అనేక ఖర్చులు తగ్గుతాయి కాబట్టి స్కూల్ ఫీజులను పెంచవద్దని దేశ అత్యున్నత న్యాయస్థానం సూచించిన రెండు నెలల తర్వాత లోకల్ సర్కిల్ సర్వే ద్వారా ఈ విషయాలు వెలుగులోకి రావడం గమనార్హం.
ఫీజుల నియంత్రణలో అసమర్థంగా రాష్ట్ర ప్రభుత్వాలు
ఫీజుల పెంపు సమస్యను పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వాలు అసమర్థంగా ఉన్నాయని సర్వేలో పాల్గొన్న 65 శాతం మంది పేర్కొన్నారు. 6 శాతం మంది రాష్ట్ర ప్రభుత్వం మెరుగైన చర్యలు తీసుకుందని చెప్పగా.. 24 శాతం మంది ఎలాంటి చర్యలు తీసుకోలేదని వెల్లడిరచారు. 41 శాతం మంది తల్లిదండ్రులు ఫీజుల పెంపు విషయంలో అసమర్థంగా రాష్ట్ర ప్రభుత్వాల తీరు ఉందని తెలిపారు.
ఫీజుల పెంపు సమంజసం కాదు
ఆన్లెన్ తరగతులకు మారడంతో విద్యుత్, వాటర్, క్రీడాపరికరాలు సహా ఇతర నిర్వహణ ఖర్చులు పాఠశాలలకు తగ్గాయి. అయితే, విద్యార్థులకు పాఠశాలలు ప్రస్తుతం అందించని సౌకర్యాలకు సైతం ఫీజులు వసూలు చేయడం సరికాదని విద్యార్థుల తల్లిదండ్రులు చెబుతున్నారు. అయితే, ఆన్లైన్ విద్యకు అనుగుణంగా ఏర్పాట్లు, ఉపాధ్యాయులను సన్నద్దం చేయడం, డిజిటల్ ఖర్చులకు అనుగుణంగా ఫీజులు నిర్ణయించబడ్డాయని ఫీజులు పెంచిన పాఠశాలల యాజమాన్యాలు వాదిస్తున్నాయి.
Share this content: