మోసేటోళ్లకు బరువు.. పని చేసేటోళ్లకు విలువ తెలుస్తది.. : ప్రతిపక్షాలపై మంత్రి హరీష్ రావు ఫైర్
దర్వాజ-సిద్దిపేట
మోసేటోళ్లకు బరువు.. పని చేసేటోళ్లకు విలువ తెలుస్తదనీ, ఢిల్లీలో, గాంధీ భవన్ లో కూసుండి మాట్లాడే వారికి ఏం తెలుస్తదని ప్రతిపక్ష బీజేపీ, కాంగ్రెస్ నాయకుల తీరుపై మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు. సిద్దిపేట నియోజకవర్గం నంగు నూర్ మండలంలో నూతన ఆసరా పెన్షన్ పంపిణి కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ పై వ్యాఖ్యలు చేశారు. ఈ కార్యక్రమంలోఆయన కొత్తగా పెన్షన్ మంజూరు అయిన లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ మాట్లాడుతూ.. ప్రజల సంక్షేమం కోసం అన్ని రకాల చర్యలు తమ ప్రభుత్వం తీసుకుంటున్నదని తెలిపారు. ప్రతిపక్షాల తీరు పై మండిపడ్డారు.
కాళేశ్వరం నీళ్లు వచ్చాయో, లేదో.. తెలియాలంటే బీజేపీ, కాంగ్రెస్ నాయకులను రాజగోపాల్ పేట చెరువులో ముంచాలని ప్రజలకు రాష్ట్ర మంత్రి హరీశ్ రావు పిలుపునిచ్చారు. మాట తప్పని నాయకుడు సీఎం కేసీఆర్ గారు అని, ఇచ్చిన మాట ప్రకారం వేయి రూపాయల పింఛన్ ను రూ.2016 పెంచి పేద లబ్ధిదారులకు అందిస్తున్నామని తెలిపారు. సిద్ధిపేట జిల్లా నంగునూరు మండలం సిద్ధన్నపేట గ్రామంలో బుధవారం హాజరై 1117 మంది లబ్ధిదారులకు నూతన ఆసరా పింఛన్ల పంపిణీ చేశారు. మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. నంగునూరు మండలంలో గతంలో 6975 పింఛన్లు ఉండేవి. కొత్తగా 1117 మందికి ఇస్తున్నాం. అన్నీ కలుపుకుని 8092 ఆసరా పింఛన్లు మంజూరు చేశామని తెలిపారు. టీడీపీ హయాంలో 75 రూపాయలు ఉండేది. ఎవరైనా మృతి చెందితేనే మరొకరికి పింఛన్లు వచ్చేవనీ, అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో రూ.200 మాత్రమే.. కొంతమందికే పింఛన్లు వచ్చేవనీ., కానీ సీఎం కేసీఆర్ గారు 200 రూపాయల పింఛన్ ను రూ.2016 రూపాయలు చేశారని మంత్రి వెల్లడించారు.
ఆనాడు కాంగ్రెస్ హయాంలో ఎట్లా ఉండేదో.. నేటి టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎట్లా మారిందో.. ఒక్కటిగా వివరిస్తూ.. టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసం చేస్తున్న అంశాలను సవివరంగా మంత్రి వివరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో నీళ్ల కోసం చాలా కష్టం ఉండేదనీ బోరు పొక్కలకే మన కష్టం అంత పోయిందని, కానీ సీఎం కేసీఆర్ గారు అపర భగీరథునిగా ఉండటంతో గోదావరి నీళ్లు మనకు వచ్చాయని మంత్రి హరీశ్ రావు అన్నారు. యాసంగిలో బోరు బండ్లు కనిపిస్తలేవు. బోర్లు వెళ్లబోయబట్టేనని.. ఇది మన కాళేశ్వరం ప్రాజెక్టు పుణ్యంగా మంత్రి చెప్పుకొచ్చారు. వరి నాట్లు వేయాలంటే ఇతర రాష్ట్రాల నుంచి మనుషులు వచ్చి నాట్లు వేస్తున్నారని, లారీలలో వడ్లు ఎక్కియ్యడానికి బీహార్ హమాలీలు వస్తున్నారని మంత్రి తెలిపారు.
దేశంలో 16చోట్ల ఢిల్లీ బీజేపీ డబుల్ ఇంజన్ అంటున్నారని., ఎక్కడైనా రూ.2వేల పింఛన్, 24 గంటల కరెంట్ ఉచితంగా ఇస్తున్నారా..? ఇస్తే చెప్పాలని డబుల్ ఇంజన్ గవర్నమెంట్ ను డిమాండ్ చేశారు. తిన్నరేవు తలవాలని.. మీరంతా సీఎం కేసీఆర్ సారు కు చల్లని దీవెనలు ఇవ్వాలని మంత్రి హరీశ్ ప్రజలను కోరారు.
Share this content: