Breaking
Mon. Jun 30th, 2025

స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ్ 2022: తెలంగాణకు మొదటి బహుమతి

Swachh Survekshan Grameen 2022, Telangana, Jagtial, Nizamabad, Haryana, స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ 2022, తెలంగాణ, జగిత్యాల్, నిజామాబాద్, హర్యానా,

దర్వాజ-న్యూఢిల్లీ

Swachh Survekshan Grameen 2022: స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ్ (ఎస్‌ఎస్‌జీ) 2022 కింద తెలంగాణ మొదటి బహుమతిని పొందగా, హర్యానా రెండవ బహుమతిని గెలుచుకుంది. తమిళనాడు మూడవ స్థానంలో నిలిచింది. గ్రామీణ ప్రాంతాల పారిశుద్ధ్య స్థితిని పరిశీలించే ఎస్‌ఎస్‌జీ పెద్ద రాష్ట్రాల (30 లక్షలకు పైగా జనాభా) విభాగంలో తెలంగాణ రాష్ట్రం అవార్డును గెలుచుకుంది. ఆదివారం న్యూఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అవార్డులను ప్రదానం చేశారు.

అండమాన్ & నికోబార్ చిన్న రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలలో (30 లక్షల కంటే తక్కువ జనాభా) అగ్రస్థానాన్ని పొందగా, డామన్ డయ్యూ & దాదర్ నగర్ హవేలీ రెండవ స్థానంలో, సిక్కిం మూడవ స్థానంలో నిలిచాయి. స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ్ కింద, భారతదేశంలోని మొదటి మూడు జిల్లాలు వరుసగా భివానీ (హర్యానా), జగిత్యాల్ (తెలంగాణ), నిజామాబాద్ (తెలంగాణ)లు టాప్ లో ఉన్నాయి.

స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ-2022 అవార్డును జలశక్తి మంత్రిత్వ శాఖ అందజేస్తుంది. కీలకమైన పరిమాణాత్మక-గుణాత్మక స్వచ్ఛ్ భారత్ మిషన్ గ్రామీణ (SBM-G) పారామితులపై సాధించిన పనితీరు ఆధారంగా, వారి పారిశుధ్య స్థితిని మెరుగుపరచడంలో గ్రామీణ సమాజం నిమగ్నత ఆధారంగా మంత్రిత్వ శాఖ రాష్ట్రాలు, జిల్లాలను ర్యాంక్ చేస్తుంది.

ఈ సందర్భంగా ముర్ము మాట్లాడుతూ.. స్వచ్ఛమైన, ఆరోగ్యకరమైన, స్వావలంబనతో కూడిన భారతదేశాన్ని నిర్మించాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. జల్ జీవన్ మిషన్ ప్రారంభంలో 3.23 కోట్ల గ్రామీణ కుటుంబాలకు మాత్రమే కుళాయి నీటి సరఫరా ఉందనీ, మూడేళ్లలో 10.27 కోట్లకు పెరిగిందని ఆమె చెప్పారు. కుళాయి నీటికి ప్రాప్యత ఇటీవలి సంవత్సరాలలో నీటి ద్వారా సంక్రమించే వ్యాధులను గణనీయంగా తగ్గించడానికి దారితీసిందన్నారు.

2014లో ‘స్వచ్ఛ్‌ భారత్‌ మిషన్‌-గ్రామీణ్‌’ ప్రారంభించినప్పటి నుంచి 11 కోట్లకు పైగా మరుగుదొడ్లు నిర్మించామనీ, దాదాపు 60 కోట్ల మంది బహిరంగ మలవిసర్జన అలవాటును మార్చుకున్నారని రాష్ట్రపతి పేర్కొన్నారు. దేశంలోని ఆరు లక్షల గ్రామాలను బహిరంగ మలవిసర్జన రహిత (ఓడిఎఫ్) ప్లస్‌గా మార్చాలనే లక్ష్యంతో ప్రభుత్వం ‘స్వచ్ఛ భారత్ మిషన్-గ్రామీణ్’ రెండో దశను అమలు చేస్తోందని ముర్ము తెలిపారు.

Related Post