Telangana: పొదల్లోకి లాకెళ్లి.. వికారాబాద్ లో మైనర్ పై సామూహిక అత్యాచారం..
దర్వాజ-హైదరాబాద్
Vikarabad : వికారాబాద్ జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ మైనర్ బాలికను ఎత్తికెళ్లిన దుండగులు.. సామూహిక లైంగికదాడికి పాల్పడ్డారు. కేసు నమోదుచేసుకున్న పోలీసులు.. దర్యాప్తు ప్రారంభించారు. వివరాల్లోకెళ్తే.. వికారాబాద్ జిల్లా పూడూరులో మైనర్ బాలిక (15)పై అదే గ్రామానికి చెందిన ప్రవీణ్ (19).. ఇంటిబయట ఒంటరిగా వున్న బాలికను గమనించి.. అరవకుండా చేతితో నోరు మూసి బాలికను బలవంతంగా పక్కనే వున్న పొలాల్లోకి ఎత్తుకెళ్లాడు. అతడి నుండి తప్పించుకోడానికి బాలిక తీవ్రంగా ప్రతిఘటించింది. దీంతో తనతో తెచ్చుకున్న మద్యాన్ని బాలికతో బలవంతంగా తాగించి.. లైంగికదాడికి పాల్పడ్డాడు.
అయితే బాలికను ప్రవీణ్ లాక్కెళుతుండగా గమనించిన మరో నిందితుడు చాకలి రవి వారిని అనుసరించాడు. కామాంధుడి నుండి బాలికను రక్షించాల్సింది పోయి తాను కూడా దారుణానికి ఒడిగట్టాడు. అప్పటికే అత్యాచారానికి గురయి అపస్మారక స్థితిలో వున్న బాలికపై రవి కూడా అఘాయిత్యానికి పాల్పడ్డాడు. చాలా సమయం తర్వాత బాలిక ఎలాగోలా ఇంటికి చేరుకుని జరిగిన విషయాన్ని కుటుంబసభ్యులకు తెలిపింది. వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదుచేసుకున్న పోలీసులు బాధితురాలిని వైద్యపరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
ఇదిలావుండగా, రాచకొండ కమిషనరేట్ పరిధిలోని చౌటుప్పల్ పట్టణంలో సోమవారం రాత్రి 23 ఏళ్ల గిరిజన మహిళపై 25 ఏళ్ల యువకుడు అత్యాచారం చేశాడు. నిందితుడిని అరెస్టు చేసి బుధవారం కోర్టులో హాజరుపరిచారు.
Share this content: