Breaking
Sun. Jun 29th, 2025

Telangana : నిజామాబాద్‌లో జాతీయ పసుపు బోర్డుతో తెలంగాణ రైతులకు కలిగే మేలు ఏమిటి?

Amit Shah Inaugurates Turmeric Board Office in Nizamabad
Amit Shah Inaugurates Turmeric Board Office in Nizamabad

దర్వాజ-నిజామాబాద్

కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదివారం నిజామాబాద్‌లో జాతీయ పసుపు బోర్డు కేంద్ర కార్యాలయాన్ని అధికారికంగా ప్రారంభించారు. ఇది తెలంగాణ పసుపు రైతుల నాలుగు దశాబ్దాల స్వప్నానికి సాకారంగా అభివర్ణించారు.

‘‘40 ఏళ్ల కల నేడు నెరవేరింది. తెలంగాణ బీజేపీ ఎంపీలు దీని కోసం తీవ్రంగా కృషి చేశారు. ఈ బోర్డు రైతులకు గొప్ప వరంగా నిలుస్తుంది: అమిత్ షా

పసుపు పంటకు రాజధాని లాంటి నిజామాబాద్

నిజామాబాద్‌ జిల్లాను పసుపు పంటకు రాజధానిగా అభివర్ణించిన అమిత్ షా, భారత పసుపు దిగుమతుల మార్కెట్‌లో అంతర్జాతీయ స్థాయిని పెంచడమే లక్ష్యమని వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం 2030 నాటికి పసుపు ఎగుమతులను $1 బిలియన్‌కి పెంచాలని యోచిస్తున్నట్టు తెలిపారు.

రైతులకు లాభాలు: శిక్షణ, బ్రాండింగ్, ఎగుమతుల మద్దతు

పసుపు బోర్డు ద్వారా రైతులకు ఆధునిక సాగు పద్ధతులపై శిక్షణ, మార్కెటింగ్, బ్రాండింగ్, జియో ట్యాగింగ్, ఎగుమతుల సదుపాయాలపై ప్రత్యేక దృష్టి సారించనున్నట్టు వెల్లడించారు. ‘‘భారత్ కోఆపరేటివ్ సొసైటీ ఆధ్వర్యంలో రైతుల మార్కెటింగ్‌కు కొత్త విధానాలు రూపొందించబడతాయి’’ అని చెప్పారు.

పసుపు అనేక ఔషధ లక్షణాలు కలిగి ఉందని, ఆరోగ్య పరిరక్షణలో కీలక పాత్ర పోషిస్తుందని అమిత్ షా అన్నారు. యాంటీవైరల్, యాంటీ క్యాన్సర్ లక్షణాలున్న పసుపును ప్రపంచ మార్కెట్‌లో మరింత ప్రాచుర్యంలోకి తేవాల్సిన అవసరాన్ని ఆయన వివరించారు.

చైర్మన్‌గా గంగారెడ్డి, తెలంగాణకు గౌరవం

తెలంగాణకు చెందిన గంగారెడ్డి జాతీయ పసుపు బోర్డు ఛైర్మన్‌గా నియమితులయ్యారని, ఇది రాష్ట్రానికి గౌరవంగా భావించవచ్చని చెప్పారు. నిజామాబాద్, కామారెడ్డి, మెట్‌పల్లి, నిర్మల్ ప్రాంతాల్లో పసుపు విస్తృతంగా సాగవుతోందని వివరించారు.

పసుపు బోర్డుతో కలిగే ముఖ్యమైన ప్రయోజనాలు:

  • పసుపు మార్కెట్ అభివృద్ధి
  • ఎగుమతుల వృద్ధి
  • ప్రాసెసింగ్ యూనిట్లు, కోల్డ్ స్టోరేజీల ఏర్పాటుకు మద్దతు
  • గిట్టుబాటు ధర సాధనకు మార్గం
  • యాంత్రీకరణ, సాంకేతిక శిక్షణ
  • నూతన వంగడాల అభివృద్ధి
  • ఉత్పత్తుల బ్రాండింగ్, మార్కెటింగ్

దేశవ్యాప్తంగా పసుపు ప్రాధాన్యం

ప్రపంచంలోనే అత్యధిక పసుపు ఉత్పత్తి భారత్‌లోనే జరుగుతోంది. ప్రపంచ వ్యాపారంలో 62% పైగా వాటా భారత్‌దే. దేశవ్యాప్తంగా 3.24 లక్షల హెక్టార్లలో పసుపు సాగవుతుండగా, తెలంగాణలో నిజామాబాద్, జగిత్యాల, నిర్మల్ జిల్లాల్లో ఇది ముఖ్య పంటగా నిలిచింది. ఈ బోర్డు ద్వారా రైతులకు నేరుగా మార్కెట్ లభ్యం కావడంతో పాటు, కొత్త పరిశోధనల ద్వారా పసుపు ఉత్పత్తి విలువ పెరగనుంది. నూతన కార్యాలయం పసుపు పరిశ్రమ అభివృద్ధికి కేంద్రంగా నిలిచే అవకాశముంది.

Related Post