దర్వాజ – హైదరాబాద్
Telangana highways: హైదరాబాద్ మహానగరానికి రాబోయే రోజుల్లో మరింత వేగవంతమైన రవాణా వ్యవస్థ కల్పించే దిశగా కీలక అడుగులు పడుతున్నాయి. రీజినల్ రింగ్ రోడ్ (ఆర్ఆర్ఆర్) ప్రాజెక్ట్ను వేగవంతం చేయాలని కోరుతూ తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి, కేంద్ర రవాణా శాఖ మంత్రి శ్రీ నితిన్ గడ్కరీని బేగంపేట విమానాశ్రయంలో కలిశారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి, ఇప్పటికే టెండర్లకు వెళ్లిన ఉత్తర ఆర్ఆర్ఆర్కు కేంద్ర ఆమోదాలు వీలైనంత త్వరగా రావాలని, దక్షిణ భాగాన్ని కూడా తక్షణమే ప్రారంభించాలని కోరారు. ఉత్తర మరియు దక్షిణ భాగాల నిర్మాణం సమాంతరంగా సాగితే, నగరాభివృద్ధికి ఎంతో మేలు జరుగుతుందని పేర్కొన్నారు.
ఈ భేటీలో రేడియల్ రోడ్ల ప్రాధాన్యతను వివరించిన సీఎం, ఓఆర్ఆర్ (ఔటర్ రింగ్ రోడ్) నుంచి మన్నెగూడ వరకు రోడ్ల అభివృద్ధి అవసరాన్ని నొక్కి చెప్పారు. అలాగే హైదరాబాద్ – శ్రీశైలం మార్గంలో మన్ననూర్ నుంచి శ్రీశైలం వరకు ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణాన్ని మంజూరు చేయాలని, హైదరాబాద్ – అమరావతి గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్వేను త్వరగా ఆమోదించాలని విజ్ఞప్తి చేశారు.
ఇతర కీలక మార్గాలలో హైదరాబాద్ – డిండి – మన్ననూర్, హైదరాబాద్ – మంచిర్యాల గ్రీన్ఫీల్డ్ హైవేల అభివృద్ధిని ప్రస్తావించారు. రాష్ట్రాన్ని మరింతగా జాతీయ రహదారి నెట్వర్క్తో అనుసంధానం చేసే ఈ ప్రాజెక్టులు, భవిష్యత్ వ్యాపార, ప్రజా రవాణా అవసరాలను తీర్చగలవని తెలిపారు.
ఈ సమావేశానికి కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి, రాష్ట్ర మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, ఎంపీలు డాక్టర్ లక్షణ్, డాక్టర్ మల్లు రవి, అనిల్ కుమార్ యాదవ్, ఇతర అధికారులు హాజరయ్యారు.
ఈ భేటీ ద్వారా తెలంగాణ రహదారి ప్రాజెక్టులకు కేంద్రం నుండి మరింత మద్దతు లభించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. రాష్ట్రం లోపల బలమైన రవాణా వ్యవస్థ ఏర్పడటం ద్వారా పెట్టుబడులు, పరిశ్రమలు, ఉద్యోగ అవకాశాలు పెరిగే అవకాశాలు ఉన్నాయి.