దర్వాజ-హైదరాబాద్
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు: మాజీ ఎమ్మెల్యేల మృతికి సంతాప తీర్మానాలు ఆమోదించిన అనంతరం మంగళవారం నాడు ప్రారంభమైన తెలంగాణ శాసనసభ వర్షాకాల సమావేశాలు సెప్టెంబర్ 12కి వాయిదా పడ్డాయి. సంతాప తీర్మానాల అనంతరం స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి సభను సెప్టెంబర్ 12వ తేదీకి వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. తుంగతుర్తి నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించిన మాజీ ఎమ్మెల్యే మల్లు స్వరాజ్యం, కమలాపూర్ నియోజకవర్గం నుంచి ఎన్నికైన పరిపాటి జనార్దన్రెడ్డి మృతికి సంతాపంగా సభ్యులు కాసేపు మౌనం పాటించారు.
అనంతరం స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి నేతృత్వంలో శాసనసభ బిజినెస్ అడ్వయిజరీ కమిటీ (బీఏసీ) సమావేశమై సెప్టెంబర్ 12, 13 తేదీల్లో మరో రెండు రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలను నిర్వహించాలని నిర్ణయించింది. బీఏసీలో డిప్యూటీ స్పీకర్ పద్మారావుగౌడ్, శాసనసభా వ్యవహారాల మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి, మంత్రులు హరీశ్రావు, గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్, చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్, ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ, కాంగ్రెస్ ఎమ్మెల్యే బట్టి విక్రమార్క పాల్గొన్నారు.
‘హైదరాబాద్ రాష్ట్ర విమోచన’కు 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా సెప్టెంబర్ 16 నుంచి మూడు రోజుల పాటు వజ్రోత్సవ సంవత్సర వేడుకలు నిర్వహించి, సెప్టెంబర్ 17ని తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్న నేపథ్యంలో స్పీకర్ ఈ సమావేశాల సమయాన్నితగ్గించారు. అసెంబ్లీ సమావేశాలు మరో రెండు రోజులు మాత్రమే నిర్వహించాలని నిర్ణయించింది. కాగా, ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు బీఏసీకి హాజరుకాలేదు.