Telangana | కేంద్రంపై పోరుకు సై.. ఏప్రిల్ 11న ఢిల్లీలో టీఆర్ఎస్ భారీ నిరసన..
దర్వాజ-రంగారెడ్డి
Telangana: రాష్ట్రంలో వరి ధాన్యాన్ని కొనుగోలు చేయడంపై భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నేతృత్వంలోని కేంద్రం వైఖరికి వ్యతిరేకంగా తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) శ్రేణులు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన నిర్వహిస్తున్నాయి. రాష్ట్రంలో పండిస్తున్న ధాన్యాన్ని చివరిగింజ వరకు కొనుగోలు చేసేంత వరకు పోరాటం సాగిస్తామని టీఆర్ఎస్ నేతలు పేర్కొంటున్నారు. కేంద్రం వైఖరికి వ్యతిరేకంగా తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) పార్టీ ఏప్రిల్ 11 సోమవారం న్యూఢిల్లీలో నిరసన చేపట్టనుంది. దేశ రాజధానిలో జరిగే నిరసన కార్యక్రమంలో పార్టీ ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు పాల్గొననున్నారు.
61 లక్షల మంది రైతులు మరియు వారి కుటుంబాలను ప్రభావితం చేస్తున్న కేంద్ర ప్రభుత్వ “వివక్ష” వరి సేకరణ విధానానికి నిరసనగా ఏప్రిల్ 11 న ఢిల్లీలో ఒక రోజు ధర్నా నిర్వహించనున్నట్లు టిఆర్ఎస్ పార్టీ తెలిపింది. నిరసన తెలిపే వేదిక, సమయం ఇంకా వెల్లడించలేదు. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు తెలంగాణ భవన్ నుంచి ఢిల్లీలోని జంతర్ మంతర్ వైపు ర్యాలీగా వెళ్లనున్నట్లు సమాచారం. అనంతరం జంతర్ మంతర్ వద్ద టీఆర్ఎస్ నేతలతో కలిసి ముఖ్యమంత్రి కొన్ని గంటల పాటు ధర్నాకు దిగనున్నారు.
ఈమేరకు పార్టీ కార్యకర్తలు గురువారం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ‘రైతు మహా ధర్నా’ నిరసనలు చేపట్టారు. సిరిసిల్లలో జరిగిన నిరసన కార్యక్రమంలో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్, ఇతర పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తెలంగాణ నుంచి ధాన్యం కొనుగోలు చేయడం లేదని ప్రధాని మోడీ ప్రభుత్వంపై మండిపడ్డారు. సిద్దిపేటలో ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి టి.హరీశ్రావు ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. రాష్ట్రంలో పండే వరి ధాన్యాన్ని సేకరించాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందని, పంజాబ్, ఇతర రాష్ట్రాల నుంచి చేస్తున్నట్టుగానే తెలంగాణ నుంచి కూడా మొత్తం నిల్వలను ఎత్తివేసేందుకు ముందుకు రావాలన్నారు.
Share this content: