దర్వాజ-లక్నో
Akhilesh Yadav : భారతీయ జనతా పార్టీ (బీజేపీ) పై సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ తనదైన స్టైల్ మరోసారి విమర్శలతో విరుచుకుపడ్డారు. ఉత్తరప్రదేశ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ ఎన్నికల్లో అధికార దుర్వినియోగానికి సంబంధించిన అన్ని రికార్డులను బీజేపీ ‘డబుల్ ఇంజిన్’ ప్రభుత్వం బద్దలు కొట్టిందంటూ ఘాటు వ్యాఖ్యలతో విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలోని స్థానిక అధికార నియోజకవర్గాల నుంచి శాసనమండలి స్థానాలకు శనివారం పోలింగ్ జరిగింది.
ఈ క్రమంలోనే ఏస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ మాట్లాడుతూ.. “కేంద్ర, రాష్ట్రంలోని బీజేపీ డబుల్ ఇంజన్ సర్కారు.. తన శక్తితో ప్రజాస్వామ్యాన్ని అణిచివేసిందని మరియు శాసన మండలిలో బలవంతంగా మెజారిటీ పొందడానికి అన్ని నైతిక నియమాలను ఉల్లంఘిస్తూ.. ప్రజాస్వామ్య విశ్వాసాలను విడిచిపెట్టింది” అని ఆరోపించారు.
బ్లాక్ డెవలప్మెంట్ కౌన్సిల్, ప్రధాన్, జిల్లా పంచాయతీ సభ్యులను వివిధ చోట్ల ఓటు వేయకుండా నిలిపివేశారని ఆరోపిస్తూ.. అధికార రక్షిత బీజేపీ వ్యక్తులు ప్రభుత్వ యంత్రాంగం సాయంతో వివిధ పోలింగ్ కేంద్రాల్లోని బూత్లను తమ ఆధీనంలోకి తీసుకుని వారికి అనుకూలంగా ఓట్లు రాబట్టుకున్నారని తీవ్ర ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఓటర్లను బెదిరింపులకు గురిచేస్తూ భాజపా అభ్యర్థులు నడుచుకున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ప్రధాన ఎన్నికల కమీషనర్కు బీజేపీ ప్రణాళికల గురించి ముందుగానే తెలియజేసినప్పటికీ ఎటువంటి చర్య తీసుకోలేదని నొక్కిచెప్పారు, దీని కారణంగా ఎన్నికల ప్రక్రియ విశ్వసనీయత ప్రశ్నార్థకమవుతోందని అఖిలేష్ యాదవ్ అన్నారు.
“SP ప్రజాస్వామ్యాన్ని నమ్ముతుంది.. ఎన్నికలలో పార్టీ అభ్యర్థులకు అనుకూలంగా ఓటు వేసినందుకు ఓటర్లందరికీ మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాము” అని ఆయన అన్నారు. అధికార దురహంకారానికి వ్యతిరేకంగా తమ పార్టీ పోరాటం కొనసాగుతుందని అఖిలేష్ యాదవ్ స్పష్టం చేశారు. సుల్తాన్పూర్, అమేథీ, డియోరియా-కుషీనగర్, కౌశాంబి, అమ్రోహా, ఇటావా-ఫరూఖాబాద్, సంత్ కబీర్నగర్ మరియు సిద్ధార్థనగర్లలో ఓటింగ్ సమయంలో అనేక అక్రమాలు జరిగాయని ఆరోపించారు. బీజేపీ ప్రభుత్వం, పరిపాలన అండదండలతో శాసనమండలి ఎన్నికల్లో ప్రజాస్వామ్య వ్యవస్థ పూర్తిగా పతనమైందని ఆరోపించారు.