ముస్లింలు లేని ఈ గ్రామంలో పీర్ల పండుగను జరుపుకుంటున్న హిందువులు.. !
దర్వాజ-బెంగళూరు
Hirebidanur: ఒక్క ముస్లిం కూడా నివసించని కర్నాటకలోని ఒక గ్రామం మహమ్మద్ ప్రవక్త మనుమలు ఇమామ్ హుస్సేన్, ఇమామ్ హసన్ ల అమరవీరుల స్మారకార్థం నిర్వహించే మొహర్రం లేదా పీర్ల పండుగను జరుపుకుంటోంది. చాలా సంవత్సరాలుగా పీర్ల పండుగను ఘనంగా జరుపుకుంటున్నారు.
వివరాల్లోకెళ్తే.. భారతదేశంలో విభిన్న మతాలు,జాతులు ఉన్నప్పటికీ.. ఐక్యతతో జీవనం సాగిస్తూ భిన్నత్వంలో ఏకత్వానికి నిదర్శనంగా నిలుస్తున్నారు ఇక్కడి ప్రజలు. ముస్లిం పండుగల్లో హిందువులు, హిందువుల పండుగల్లో ముస్లింలు పాల్గొనడం చూస్తూనే ఉన్నాం. ఈ క్రమంలోనే ఒక్క ముస్లిం కూడా లేని బెళగావి జిల్లాలోని సౌందరి తాలూకాలోని హిరేబిదనూర్ గ్రామస్థులు ఒక శతాబ్దానికి పైగా మొహర్రం ఘనంగా జరుపుకుంటున్నారు. నిత్యం అక్కడి మసీదులో ప్రార్థనలు సైతం చేస్తున్నారు. కానీ వీరంతా కూడా హిందువులే కావడం గమనార్హం.
ఇటీవల పునరుద్ధరించిన ఈ మసీదును స్థానికులు ‘ఫకీరేశ్వర్ స్వామి’ మసీదుగా నామకరణం చేశారు. మొహర్రం మాసం వచ్చిందంటే గ్రామమంతా కూడా రంగురంగుల లైట్ల కాంతులతో వెలిగిపోతుంది. ఇక్కడ ప్రార్థనలు నిర్వహించే హిందూ పూజారి యల్లప్ప నాయకర్ ఈ విషయం గురించి వివరిస్తూ.. చాలా కాలం క్రితం ఇద్దరు ముస్లిం సోదరులు మసీదును నిర్మించారు. గుత్తనట్టి గ్రామానికి సమీపంలో మరో భవనాన్ని కూడా నిర్మించారు.
అయితే, ఆ ఇద్దరు సోదరులు మరణిండంతో చుట్టుపక్కల ముస్లింలు ఎవరూ లేకపోవడంతో, స్థానికులు (ఎక్కువగా హిందూ) ప్రతి సంవత్సరం పీర్ల పండుగను నిర్వహిస్తున్నారు. కర్బల నృత్యం, అగ్నిపై నడుస్తూ పీర్లను నిలబెట్టి మొహర్రం ను జరుపుకుంటుననారు. చాలా సంవత్సరాల నుంచి గ్రామంలో పీర్ల పండుగను జరుపుకుంటున్నామని స్థానికులు చెబుతున్నారు.
Share this content: