దర్వాజ-హైదరాబాద్
TPCC president Revanth Reddy: వచ్చే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్నారైలు కాంగ్రెస్ పార్టీకి అండగా నిలవాలని ఎన్నారైలను తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి కోరారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం కేసీఆర్ను ఓడించేందుకు ఎన్నారైల మద్దతు అవసరమన్నారు. ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు (కేసీఆర్) కుటుంబ కబంధ హస్తాల నుంచి తెలంగాణ రాష్ట్రానికి విముక్తి లభించేంత వరకు పోరాడుతామని ప్రతిజ్ఞ చేశారు. తెలంగాణకు చెందిన ఎన్నారైలు అమెరికా అభివృద్ధిలో ప్రధాన పాత్ర పోషిస్తున్నందుకు గర్వపడుతున్నానని పేర్కొన్నారు. ఎన్నారైలు తెలంగాణ డెవలప్మెంట్ ఫోరమ్ (టిడిఎఫ్) ఏర్పాటు చేసి రాష్ట్ర ఏర్పాటుకు ఎంతో కృషి చేశారని గుర్తు చేశారు.
ప్రస్తుతం రేవంత్ రెడ్డి అమెరికాల పర్యటనలో ఉన్నారు. ఈ క్రమంలోనే ఆయన అమెరికాలోని డల్లాస్లో జరిగిన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం కార్యక్రమంలో పాలుపంచుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ పై వ్యాఖ్యలు చేశారు. “తెలంగాణను కేసీఆర్ కుటుంబం నుంచి కాపాడుతాం.. నేను, తెలంగాణ కాంగ్రెస్ నేతలు ప్రాణాలు కోల్పోయినా పోరాటాన్ని విరమించబోము.. ” అని పేర్కొన్నారు. రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో టీపీసీసీ చీఫ్తో పాటు కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, ఇతర నేతలు పాల్గొన్నారు. పల్లెల నుంచి వచ్చిన తెలంగాణ నిపుణులు అమెరికా కంపెనీల్లో ఉన్నత స్థానాలకు ఎదగడం చూసి తాము సంతోషంగా ఉన్నామని రేవంత్ అన్నారు.