దర్వాజ-అంతర్జాతీయం
yasin malik: ఉగ్రవాద కార్యకలాపాలకు నిధులు నిధులు సమకూర్చిన కేసులో కశ్మీరీ వేర్పాటువాద నాయకుడు యాసిన్ మాలిక్కు జీవిత ఖైదు విధించడంపై కొన్ని దేశాలు భారత్పై విమర్శలు చేశాయి. ఈ క్రమంలోనే స్పందించిన భారత్ వారిని ఘాటుగా బడులిచ్చింది. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా యావత్ ప్రపంచం పోరాడుతోన్న వేళ.. దాన్ని సమర్థించడం సరికాదంటూ ఇస్లామిక్ దేశాలకు చెందిన ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్(ఓఐసీ)కు హితవు పలికింది.
ఉగ్రవాదులకు నిధులు సమకూర్చడంతో పాటు దేశంపై దాడికి కుట్ర తదితర నేరాల్లో యాసిన్ మాలిక్ దోషిగా తేలడంతో అతడికి యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ ఇటీవల ఎన్ఐఏ కోర్టు తీర్పు వెలువరించింది. అయితే ఈ తీర్పును ఇస్లామిక్ దేశాల మానవ హక్కుల విభాగం ఓఐసీ-ఐపీహెచ్ఆర్సీ ( OIC-IPHRC) ఖండించింది. యాసిన్ మాలిక్ శిక్ష విషయంలో భారత్ పక్షపాత ధోరణితో వ్యవహరించిందని వ్యాఖ్యానించింది.
ఈ క్రమంలోనే స్పందించిన కేంద్ర విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అరీందమ్ బాగ్చీ.. ‘‘యాసిన్ మాలిక్ కేసులో ఇచ్చిన తీర్పుపై భారత్ను విమర్శిస్తూ ఓఐసీ-ఐపీహెచ్ఆర్సీ చేసిన విమర్శలు ఆమోదయోగ్యం కాదు. ఈ వ్యాఖ్యలతో యాసిన్ మాలిక్ ఉగ్ర కార్యకలాపాలకు ఆ దేశాలు మద్దతిస్తున్నట్లు అర్థమవుతోంది. ఉగ్రవాదాన్ని ఏ విధంగానూ సహించకూడదని యావత్ ప్రపంచం కోరుకుంటోంది. అలాంటప్పుడు ఓఐసీ ఎట్టిపరిస్థితుల్లోనూ దాన్ని సమర్థించకూడదు’’ అని పేర్కొన్నారు.