- జులై 8న పార్టీ పేరు, జెండా, అజెండా ప్రకటిస్తా: వైఎస్ షర్మిల
- రాజన్న బిడ్డను ఆశీర్వదించండి: వైఎస్ విజయమ్మ
- ఖమ్మంలో వైఎస్. షర్మిల రాజకీయ పార్టీ సంకల్ప బహిరంగ సభ
దర్వాజ-ఖమ్మం
తెలంగాణ గడ్డ రుణం తీర్చుకుంటాననీ, తాను ఒంటరిని కాదనీ.. ప్రజలు తోడుగా ఉన్నారని వైఎస్ షర్మిల అన్నారు. తెలంగాణలో రాజకీయ పార్టీని స్థాపించబోతున్న ఆమె ఖమ్మం పట్టణంలో మొదటి బహిరంగ సభను నిర్వహించారు. పేవిలియన్ గ్రౌండ్స్లో ఏర్పాటు చేసిన పార్టీ సంకల్ప సభకు భారీగా జనాలు తరలివచ్చారు. తెలంగాణ సాంస్కృతికి అద్దం పట్టే పాటలు పాడుతూ.. కళాకారుల ప్రదర్శనలతో సభ ప్రారంభమైంది.
షర్మిల వేదికపైకి చేరిన వెంటనే భారీగా తరలివచ్చిన జనాలు సీఎం సీఎం అంటూ నినాదాలతో హోరెత్తించారు. ఉద్యమాల గుమ్మం ఖమ్మం అంటూ ఆమె తన ప్రసంగాన్ని ప్రారంభించారు. తాను ప్రారంభించబోయే పార్టీ తెలంగాణ ప్రజల పార్టీ అని తెలిపారు. మనసా వాచా కర్మణా ప్రజల కోసమే తమ పార్టీ పనిచేస్తుందని స్పష్టం చేశారు.

తాను ఈ గడ్డ మీదే గాలి పీల్చాననీ, ఈ గడ్డ మీదే నీళ్లు తాగానని అన్నారు. తెలంగాణ గడ్డకు సేవ చేయాలనుకోవడం, రుణం తీర్చుకోవాలనుకోవడం తప్పా? అంటూ గళమెత్తారు. అలాగే, సింహం సింగిల్ గానే వస్తుందంటూ పార్టీ శ్రేణులు,అభిమానుల్లో జోష్ నింపారు. తాను పదవుల కోసం కాదు, ప్రజల కోసం నిలబడతానని స్పష్టం చేశారు. ప్రభుత్వం ఉద్యోగాల భర్తీని వెంటనే చేపట్టకపోతే నిరాహార దీక్ష చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
వైఎస్ఆర్ జయంతి రోజున పార్టీ వివరాలు..!
పార్టీ సంకల్ప సభ కావడంతో పార్టీ పేరు, గుర్తు, అజెండా తదితర అంశాలు ఈ సభలోనే షర్మిల ప్రకటిస్తారని అందరూ భావించారు. అయితే, తాను స్థాపించబోయే రాజకీయ పార్టీ పేరును వైఎస్ఆర్ జయంతి (జులై 8) రోజున ప్రకటిస్తామని వెల్లడించారు. పార్టీ పేరుతో పాటు పార్టీ జెండా, అజెండా తదితర విషయాలను వెల్లడిస్తామని తెలిపారు.
రాజన్న బిడ్డను ఆశీర్వదించండి: వైఎస్ విజయమ్మ

ఖమ్మం సంకల్ప సభలో వైఎస్ విజయమ్మ మాట్లాడుతూ.. 18 ఏండ్ల కిందట ఏప్రిల్ 9న వైఎస్సార్ చేవెళ్ల నుంచే పాదయాత్ర చేశారని తెలిపారు. ఇప్పుడదే రోజున తన తండ్రి అడుగుజాడల్లో ఖమ్మం జిల్లా నుంచి తన రాజకీయ తొలి అడుగులు వేసేందుకు షర్మిల మీ ముందుకు వచ్చిందన్నారు. రాజన్న బిడ్డ కొత్త పార్టీ పెడుతుందనీ, తమ ఆశీర్వాదాలు ఇవ్వాలని కోరారు. అలాగే, షర్మిల పార్టీ పెడుతున్నదని తెలియగానే మనస్ఫూర్తిగా ఆశీర్వదించడానికి వచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు అంటూ తన ప్రసంగాన్ని ముగించారు.
ఒక్కరోజే 1.26 లక్షల మందికి కరోనా
లింగ సమానత్వం ఇప్పట్లో జరగనట్టే !