దర్వాజ-అమరావతి
Union Home Ministry’s meeting: ఏపీ విభజన చట్టంలోని హామీల అమలుపై కేంద్ర హోంశాఖ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో ఎజెండాలో 14 అంశాలు ఉన్నాయి. వీటిలో 7 అంశాలు రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించినవి కాగా, మరో 7 అంశాలు ఏపీకి సంబంధించినవి ఉన్నాయి. ఇదిలా ఉండగా, శివరామకృష్ణన్ కమిటీ సిఫారసు మేరకు రాజధాని నిర్మాణానికి రూ.29,000 కోట్లు, వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి రూ.20,000 కోట్లు మంజూరు చేయాలని ఏపీ ప్రభుత్వం కోరింది. షీలాబేడీ కమిటీ సిఫారసుల ప్రకారం 89 సంస్థలను విభజించాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కేంద్రీయ వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని స్థాపించాలని కోరింది.
రెండు రాష్ట్రాలకు సంబంధించిన అంశాల్లో ప్రభుత్వ కంపెనీలను కార్పొరేషన్ గా విభజించడం, షెడ్యూల్-10 కింద కంపెనీల విభజన, చట్టంలో లేని ఇతర సంస్థల విభజన, ఏపీ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ విభజన, సింగరేణి కాలరీస్ ఏపీ హెవీ మిషనరీ ఇంజినీరింగ్ లిమిటెడ్ డీమెర్జర్, బ్యాంకుల్లో నగదు, నిల్వల పంపిణీ, ఏపీఎస్సీఎల్ విడుదల, టీఎస్ సీఎస్ఎల్ క్యాష్ క్రెడిట్, 2014-15 బియ్యం సబ్సిడీ అంశాలు ఉన్నాయి. కొత్త రాజధాని ఏర్పాటుకు కేంద్ర సహకారం, ఏపీ విభజన చట్టం కింద పన్ను రాయితీలు, ఏపీలోని వెనుకబడిన ఏడు జిల్లాలకు గ్రాంట్లు, పన్ను మదింపులో లోపాలను సరిదిద్దడం, కొత్త విద్యా సంస్థల స్థాపన, కొత్త రాజధానిలో వేగవంతమైన రైల్వే కనెక్టివిటీ వంటి అంశాలపై చర్చించారు.