- ఈ వ్యవస్థ మేల్కొనడానికి ఇంకెన్ని మరణాలు సంభవించాలి : రాహుల్ గాంధీ
దర్వాజ-బెంగళూరు
దేశంలో కరోనా మహమ్మారి కల్లోలం రేపుతూనే ఉంది. ఒక వైపు నిత్యం రికార్డు స్థాయిలో కొత్త కేసులు, మరణాలు మరోవైపు ఆస్పత్రుల్లో పడకల కొరత, ఆక్సిజన్ కొరత, కరోనా చికిత్స మందుల కొరత, టీకాల కొరతతో దేశంలో పరిస్థితులు మరింత దారుణంగా మారుతున్నాయి.
ఇప్పటికే పడకల కొరతతో ఆస్పత్రుల ముందు.. ఆస్పత్రుల్లో ఆక్సిజన్ కొరత కారణంగా ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇప్పటికే ఆక్సిజన్ కొరత కారణంగా వివిధ ఆస్పత్రుల్లో డజన్ల కొద్ది కరోనా రోగులు ప్రాణాలు కోల్పోయారు. తాజాగా కర్నాకటలోనూ ఆక్సిజన్ అందక (కొరత) కేవలం రెండు గంటల వ్యవధిలో 24 మంది మరణించారు.
ఈ విషాదకర ఘటన కర్నాటకలోని చామరాజనగర్లోని జిల్లా ఆస్పత్రిలో చోటుచేసుకుంది. ఆదివారం అర్థ రాత్రి 12 గంటల నుంచి 2 గంటల సమయంలో ఆక్సిజన్ కొరతతో సరఫరా నిలిచిపోవడంతో రోగులు ప్రాణాలు కోల్పోయినట్టు సమాచారం. అయితే, అధికారులు మాత్రం చనిపోయిన రోగులలో కొద్ది మంది మాత్రమే కరోనా రోగులు ఉన్నారనీ, వారి చావుకు ఆక్సిజన్ కొరత కారణం కాదని పేర్కొంటున్నారు.
24 మంది రోగుల కుటుంబ సభ్యులు ఆక్సిజన్ అందక చనిపోయారని ఆవేదన వ్యక్తం చేస్తూ.. ఆస్పత్రి నిర్లక్ష్యంగా వ్యవహరించిన తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆస్పత్రి ముందు ఆందోళనకు దిగారు. కాగా, ఈ ఆస్పత్రిలో మొత్తం 144 మంది కరోనా రోగులకు చికిత్స అందిస్తున్నారు. ఈ విషాద ఘటనపై ముఖ్యమంత్రి యడియూరప్ప దర్యాప్తునకు ఆదేశించారు.
దేశంలో ఆక్సిజన్ అందక రోగులు ప్రాణాలు కోల్పోతున్న నేపథ్యంలో ప్రభుత్వం ధోరణిపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చామరాజనగర్ ఘటనపై స్పందించిన రాహుల్ గాంధీ.. 24 మంది రోగులు చనిపోయారా? లేక చంపేశారా? ఈ వ్యవస్థ మేల్కొనాలంటే ముందు ఇంకెన్ని మరణాలు సంభవించాలి అంటూ ట్వీట్ చేశారు. అలాగే, మృతుల కుంటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.