దర్వాజ-హైదరాబాద్
హైదరాబాద్లోని సైదాబాద్ సింగరేణి కాలనీలో దారుణం చోటుచేసుకుంది. ఓ ఆరేండ్ల చిన్నారి దారుణ హత్యకు గురయింది. కాలనీకి చెందిన చిన్నారి గురువారం సాయంత్రం 5 గంటల నుంచి కనిపించకుండా పోయింది. చిన్నారిని వెతుకుతున్న క్రమంలో పక్కింట్లో ఉండే రాజు అనే వ్యక్తి ఇంట్లో గుర్తించారు. అయితే అప్పటికే చిన్నారి విగతజీవిగా పడివుంది.
ఈ నేపథ్యంలోనే సింగరేణి కాలనీకి చెందిన స్థానికులు ఆందోళనకు దిగారు. బాలికపై లైంగికదాడి జరిగినట్టు అనుమానం వ్యక్తంచేస్తున్నారు. ఆమెపై రాజు ఘాతుకానికి పాల్పడినట్టు ఆరోపిస్తూ న్యాయం చేయాలంటూ ఆందోళనకు దిగారు. అక్కడి పోలీసులు రావడంతో.. వారితో వాగ్వాదం జరిగి ఉద్రిక్తత పరిస్థితులకు దారితీసింది. ఈ క్రమంలో పోలీసులు, స్థానికులకు మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. దీంతో పలువురు పోలీసులతో పాటు స్థానికులు సైతం గాయపడ్డారు.
ఇదిలావుండగా, బాలికకు న్యాయం చేయాలని డిమాండ్లు పెరుగుతున్నాయి. ఈ క్రమంలో ఆందోళనలు సైతం పెరుగుతున్నాయి. అయితే, నిందితులకు నెల రోజుల్లో శిక్ష పడేలా చూస్తామని పోలీసులు హామీ ఇవ్వడంతో తమ ఆందోళనను స్థానికులు విరమించుకున్నారు. కాగా, శవపరీక్ష నివేదికలో ఆమెపై లైంగిక వేధింపులు, గొంతు కోసి ప్రాణాలు తీసినట్టుగా తేలిందని సమాచారం.