– ఆఫ్ఘాన్లో ఆకలి కేకలు
– ఆకలితో 1.40 కోట్ల మంది : వరల్డ్ ఫుడ్ ప్రొగ్రాం నివేదిక
దర్వాజ- అంతర్జాతీయం
Afghanistan Taliban: ఆఫ్ఘానిస్థాన్ ను తాలిబన్లు ఆక్రమించుకున్నప్పటి నుంచి అక్కడి ప్రజల పరిస్థితులతో పాటు దేశ పరిస్థితులు సైతం దారుణంగా మారుతున్నాయి. మరీ ముఖ్యంగా ఆర్థిక పరిస్థితులు ప్రతికూలంగా మారుతూ.. ప్రజలను ఆకలి కొరల్లోకి దించుతున్నది. ద్రవ్యోల్బణం రికార్డు స్థాయిలో పెరుగుతూ నిత్యావసరాల ధరలు చుక్కలనంటుతున్నాయి. దీంతో ఆఫ్ఘన్ ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారని తాజాగా వరల్డ్ ఫుడ్ ప్రొగ్రామ్ నివేదిక పేర్కొంది.
వరల్డ్ ఫుడ్ ప్రొగ్రామ్ నివేదిక ప్రకారం.. ఆఫ్ఘానిస్థాన్ లో ఆకలి కేకలు పెరుగుతున్నాయి. ప్రతి ముగ్గురిలో ఒకరు ఆకలితో ఉన్నారు. అంటే దేశంలో 1.40 కోట్ల మంది ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారు. దాదాపు 20 లక్షలకు పైగా మంది చిన్నారులు పోషకాహార లోపంతో బాధపడుతున్నారు. వర్షాలు పడకపోవడంతో పేదరికంలోకి జారుకుంటున్న వారి సంఖ్య అధికమవుతున్నది. పలు చోట్ల తాగేందుకు నీరు సైతం దొరకటం లేదు. ఆఫ్ఘానిస్థాన్ ప్రజలు తక్షణ సాయం అవసరమని వరల్డ్ ఫుడ్ ప్రొగ్రామ్ తన నివేదికలో స్పష్టం చేసింది.
ఒక ప్లేట్ అన్నం రూ.7000
ఆఫ్ఘానిస్థాన్లో ప్రస్తుతం ఆర్థిక పరిస్థితులు ప్రతికూలంగా మారడంతో ద్రవ్యోల్బణం ఆకాశమే హద్దుగా పెరుగుతున్నది. దీంతో నిత్యావసరాల ధరలు రికార్డు స్థాయికి చేరుకుంటున్నాయి. మరీ ముఖ్యంగా కాబుల్ పరిస్థితులు దారుణంగా మారుతున్నాయి. కాబుల్ పరిసర ప్రాంతాల్లో నిత్యాసరాల సరఫరా తగినంతగా లేకపోవడంతో వాటి ధరలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. కాబుల్ విమానాశ్రయంలో ఒక్క వాటర్ బాటిల్ ధర రూ.3 వేలు, ఒక ప్లేట్ ఆహారం ధర రూ.7 వేలకు చేరిందంటే అక్కడి పరిస్థితులు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు.
ఇదిలా ఉండగా, దేశంలోని ఇతర ప్రాంతాల్లోనూ ప్రజల పరిస్థితులు దారుణంగా మారుతున్నాయి. గత రెండు నెలల నుంచి ప్రభుత్వ, ప్రయివేటు ఉద్యోగులకు జీతాలు అందలేదు. దేశంలోని చాలా చోట్ల బ్యాంకులు మూతపడటం, ఏటీఎంలలో నగదు లేకపోవడంతో ప్రజలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.