బీహార్లో కరోనాతో 9,375 మృతి
దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టిన మరణాలు మాత్రం తగ్గడం లేదు. ఈ నేపథ్యంలోనే దేశంలోని పలు రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా కేసులు, మరణాలకు సంబంధించి సరైన సమాచారం వెల్లడించడం లేదని ఇప్పటికే అనేక ఆరోపణలు ఉన్న సంగతి తెలిసిందే. బీహార్ ప్రభుత్వం కరోనా కేసులు, మరణాల సంఖ్యను తగ్గించి చూపిస్తున్నారన్న వార్తలు తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో కరోనాకు సంబంధించి సరైన లెక్కలు (సమాచారం) వెల్లడించాలని పాట్నా హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఏప్రిల్-మే నెలల్లో రాష్ట్రంలో ఎంతమంది చనిపోయారో సరిగ్గా పరిశీలించాలని న్యాయస్థానం పేర్కొంది.
దీంతో బీహార్ సర్కారు తాజాగా కరోనా గణాంకాలను సవరిస్తూ… కరోనా సమాచారాన్ని వెల్లడించింది. దీని తాజాగా డేటా ప్రకారం.. ఇదవరకు ప్రభుత్వం చూపించిన కరోనా మృతుల సంఖ్య కంటే ఇప్పుడు 72.8 శాతం అధికంగా చూపడం గమనార్హం. తమ రాష్ట్రంలో 5,424 మంది మాత్రమ కరోనాతో మృతి చెందారని మొదట్లో చెప్పిన బీహార్, ఇప్పుడు మృతుల సంఖ్యను 9,375కి పెంచింది. అంటే మృతుల సంఖ్యను ఇప్పుడు 3,951 పెంచి చూపింది.
పాట్నా హైకోర్టు ఆదేశాలతో దాదాపు 20 రోజుల పాటు బీహార్ ప్రభుత్వ అధికారులు రికార్డులను తెప్పించుకుని గణాంకాలను సరిచేసి విడుదల చేశారు. నాలుగు జిల్లాల్లో కరోనా మృతుల సంఖ్యను దాదాపు 200 శాతం చొప్పున పెంచడం గమనార్హం. గత ఏడాది మార్చి నుంచి ఈ ఏడాది మార్చి వరకు బీహార్లో కొవిడ్తో 1,600 మంది ప్రాణాలు కోల్పోయినట్టు ప్రభుత్వ గణాంకాలు పేర్కొంటున్నాయి. అయితే, గత రెండు నెలల్లో మాత్రం ఏకంగా 7,775 మంది చనిపోయారు. అంటే ఐదు రెట్లు పెరిగాయి.
ఇక పాట్నాలో 2,303 మంది చనిపోయినట్టు ప్రభుత్వ గణాంకాలు పేర్కొంటుండగా.. అక్కడి శ్మశాన వాటికల అధికారిక రికార్డుల ప్రకారం 3,243 మంది కరోనా మృతులకు అంత్యక్రియలు నిర్వహించారు. దీనిని బట్టి చూస్తే సీఎం నితీష్ కుమార్ సారథ్యంలోని బీహార్ ప్రభుత్వం వెల్లడించిన కరోనా డేటా పై ఇప్పటికే అనేక అనుమానాలు లేవనెత్తున్నాయి.
Share this content: