విద్యార్థినిని కత్తితో పొడిచి..
◙ గుంటూరులో పట్టపగలే విద్యార్థిని దారుణ హత్య
◙ పోలీసుల అదుపులో నిందితుడు
దర్వాజ-అమరావతి
20-year-old BTech student stabbed to death in Guntur: పట్టపగలే ఓ విద్యార్థినిపై కత్తితో దాడిచేసి.. దారుణంగా హత్య చేసిన ఘటన గుంటూరులో చోటుచేసుకుంది. పట్టపగలే నడిరోడ్డుపై జనం చూస్తుండగానే బీటెక్ చవుదువున్న దళిత విద్యార్థిని రమ్యను (20).. శశికృష్ణ (24) అనే యువకుడు కత్తితో పొడిచి అత్యంత పాశవికంగా హతమార్చాడు. పోలీసుల వివరాల ప్రకారం.. గుంటూరు నుంచి విజయవాడ వెళ్లే ప్రధాన రహదారిలో పరమయ్యగుంట సెంటరువద్ద ఆదివారం ఉదయం 10 గంటలకు ఈ ఘటన చోటుచేసుకుంది. గుంటూరుకు చెందిన నల్లపు వెంకట్రావు, జ్యోతి దంపతులకు ఇద్దరు కుమార్తెలు. చిన్న కుమార్తె రమ్య (20) చేబ్రోలు ఓ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ చదువుతున్నారు. అక్క మౌనికతోపాటు గుంటూరు పరమయ్యగుంటలో నానమ్మ ఇంటివద్ద ఉంటున్నారు.
రమ్యకు ముట్లూరుకు చెందిన శశికృష్ణతో ఇన్స్టాగ్రామ్లో స్నేహమేర్పడింది. హత్య సంఘటనకు ముందు వారిద్దరు పరమయ్యగుంట వద్ద హోటల్ సమీపంలో మాట్లాడుకుంటుండగా.. వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలోనే నిందితుడు రమ్యపై విచక్షణ రహితంగా దాడికి పాల్పడ్డాడు. దీంతో ఆ విద్యార్థిని ప్రాణాలు కోల్పోయింది. నిందితుడు విద్యార్థినిపై దాడికి పాల్పడుతున్న క్రమంలో స్థానికులు ఎవరూ అడ్డుకోలేదని విచారణ సందర్భంగా ఓ వృద్ధురాలు వెల్లడించిందని పోలీసులు తెలిపారు.
కాగా, నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై పలు సెక్షన్ల కింద కేసు నమోదుచేసి, దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. ఇక దీనిపై రాజకీయ నాయకులతో పాటు సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. నిందితుడికి ఉరిశిక్ష విధించాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి.
Share this content: