కరోనాను కట్టడిచేయడం, మరణాలను తగ్గించడంలో వ్యాక్సిన్ కీలకంగా మారింది. ఈ క్రమంలోనే ప్రభుత్వం వ్యాక్సిన్ ఉత్పత్తి సంస్థలతో టీకాల కోసం చర్చలు జరుపుతూ.. దేశంలో మరిన్ని టీకాలు తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలోనే దేశంలో త్వరలోనే మరో కరోనా వ్యాక్సిన్ రాబోతోంది. తెలంగాణ రాజధాని హైదరాబాదుకు చెందిన బయోలాజికల్-ఈ ఫార్మా సంస్థ అభివృద్ధి చేసిన కోర్బెవాక్స్ కరోనా వ్యాక్సిన్ ప్రస్తుతం కేంద్రం అనుమతుల కోసం ఎదురుచూస్తోంది.
ప్రభుత్వం నుంచి ఈ వ్యాక్సిన్కు అనుమతులు లభిస్తే.. ప్రస్తుతం అందుబాటులో ఉన్న అన్ని కరోనా వ్యాక్సిన్లలోకి ఇదే అత్యంత చవకైన వ్యాక్సిన్ కానుంది. కోర్బెవాక్స్ సింగిల్ డోస్ ధరను బయోలాజికల్ ఇ సంస్థ రూ.250గా నిర్ణయించింది. అదే రెండు డోసులు అయితే రూ.400కే పొందవచ్చని తాజాగా బయోలాజికల్-ఈ పేర్కొంది.
కాగా, ప్రస్తుతం సీరం ఇనిస్టిట్యూట్ ఉత్పత్తి చేస్తున్న కోవిషీల్డ్ వ్యాక్సిన్ సింగిల్ డోసును రాష్ట్ర ప్రభుత్వాలకు రూ.300 , అదే ప్రయివేటు ఆస్పత్రులకు రూ.600 అందిస్తోంది. హైదరాబాద్కు చెందిన భారత్ బయోటెక్ తయారుచేసే కోవాగ్జిన్ రాష్ట్ర ప్రభుత్వాలకు రూ.400, ప్రయివేటు ఆస్పత్రులకు రూ.1,200 అందిస్తోంది. ఇక, రష్యా వ్యాక్సిన్ స్పుత్నిక్-వీ ఒక్క డోసు ధర రూ.995 గా ఉంది. ఈ లెక్కన చూస్తే బయోలాజికల్-ఈ కోర్బెవాక్స్ ధర తక్కువనే చెప్పాలి. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఈ సంస్థతో టీకాల కోసం ముందస్తు ఒప్పందం కూడా చేసుకుంది. దాదాపు 30 కోట్ల డోసులకు అర్డర్ చేసినట్టు సమాచారం.