స్కూల్ సమీపంలో ఉగ్రదాడి.. 55 మంది మృతి
దర్వాజ-కాబుల్
ఆఫ్ఘానిస్థాన్లో ఉగ్రవాదులు మరోమారు చెలరేగిపోయారు. దేశ రాజధాని కాబూల్లోని ఓ పాఠశాల వద్ద బాంబు దాడికి తెగబడ్డారు. ఈ బాంబు దాడిలో 55 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో అత్యధికం విద్యార్థులే ఉన్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని స్థానిక అధికార వర్గాలు వెల్లడించాయి. ఈ ఘటనలో మొత్తం 150 మంది తీవ్రంగా గాయపడ్డారు.
ఈ బాంబు దాడిలో గాయపడిన, ప్రాణాలు కోల్పోయిన చిన్నారుల్లో అత్యధికం 11 నుంచి 15 ఏండ్ల లోపు వారు ఉన్నారని అధికారులు తెలిపారు. వీరిలో అత్యధికం బాలికలే ఉన్నారు. క్షతగాత్రులను వెంటనే ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది.
షియా వర్గం అధికంగా ఉంటే పశ్చిమ కాబూల్లోని దష్ట్-ఎ-బార్చి జిల్లాలోని సయ్యద్ అల్ షాదా పాఠశాల వద్ద జరిగిన ఈ ఘటనతో తమకు ఎలాంటి సంబంధం లేదని తాలిబన్లు ప్రకటించారు. అయితే, ఈ దాడికి బాధ్యత వహిస్తూ ఇప్పటివరకు ఏ ఉగ్రవాద సంస్థ కూడా ప్రకటన చేయలేదు.
Share this content: