దర్వాజ-న్యూఢిల్లీ
deaths in judicial custody : దేశంలోని జ్యుడిషియల్ కస్టడీ మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా కేంద్రం వెల్లడిరచిన గణాంకాలే దీనిని రుజువు చేస్తున్నాయి. రాజ్యసభలో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. గత మూడేండ్లలో భారత్లో దాదాపు 5,221 మంది జ్యుడిషియల్ కస్టడీలో ఉండగా చనిపోయారు. అలాగే, 348 మంది పోలీసుకస్టడీలో మరణించారు. రాజ్యసభలో ఎంపీ రామ్కుమార్ వర్మ అడిగిన ప్రశ్నకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ పై విధంగా లిఖిత పూర్వక సమాధానమిచ్చారు.
కాగా, జ్యుడిషియల్ కస్టడీ మరణాలు అత్యధికం బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్లో 1,295 మరణాలు నమోదయ్యాయి. తర్వాతి స్థానాల్లో మధ్యప్రదేశ్ (441), బెంగాల్ (407), బీహార్ (375) లు ఉన్నాయి. పోలీస్ కస్టడీ మరణాలు గుజరాత్లో (42) అధికంగా నమోదయ్యాయి. ఆ తర్వాతి స్థానాల్లో మధ్యప్రదేశ్ (34), మహారాష్ట్ర (27), యూపీ (23) లు ఉన్నాయి. ఇక ఏడాదివారీగా చూసుకుంటే.. 2020-21లో 1,940 కస్టోడియల్ మరణాలు ఉన్నాయి. అలాగే, 2019-2020లో 1,696 కాగా, 2018-19లో 1,993గా నమోదయ్యాయి.
కాగా, దేశంలోని పోలీస్ స్టేషన్లలో మానవ హక్కుల ఉల్లంఘనలపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) ఎన్వీ రమణ ఈనెల 8న ఆందోళన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.