అరే.. రాజకీయ నాయకులు అసలు చేయాల్సిన పనులను పక్కన పడేసి.. కొసరు పనులను చేస్తరు. గదెట్లా అంటారా ? ఏ ప్రచారం చేసినా, ఎన్ని డబ్బులు పంచినా.. దేనికోసం. కేవలం తనకు ఓటు వేయాలనే కదా! మరి ఆ ఓటు ఎలా వేయాలి? పోలింగ్ బూత్ లోకి పోగానే ముందు చేయాల్సి పనులేంది.. అనే ముచ్చట్లు చెప్పాలి కదా? గందుకే అంటరు.. కొసరు కంటే అసలు ముఖ్యమని. గా అసలు చేసే పనులను పక్కన పెడితే.. ఎంత చేసినా బుడిదలో పోసిన పన్నీరే..
ఈ మధ్య కాలంలో ఈవీఎం మిషన్లు వచ్చి గా తిప్పలు లేకుండా చేసినవి. జస్ట్ మనకు నచ్చిన క్యాండెట్ కు కేటాయించిన గుర్తును చూసి దాని పక్కనున్న బటన్ ను నొక్కితే సరిపాయే. కానీ బ్యాలెట్ బాక్స్ దగ్గరకు రాగానే అంతా తారుమారైపోతుంది. స్వస్తిక్ గుర్తును సక్కగ వేయడం రాక.. నేటికీ ఎన్నో ఓట్లు ఫెయిల్ అవుతునే ఉన్నాయి.

కేవలం ఒక్క ఓటుతో ఓడిపోయిన సర్పంచ్ అని చెబుతుంటారు. ఈ సమయంలో అక్కడి ఓట్లను గమనిస్తే.. గెలిచేవాడే.. కానీ కొందరికి ఓట్లు వేయడం రాకపోవడంతో ఓడి పోయాడు అని చెబుతుంటారు. దీనిపై ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా కానీ రాజకీయ నాయకులు కూడా దీనిపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలా చేయకపోతే.. తనకు పడ్డ ఓటు కూడా అభ్యర్థి చేసిన చిన్న పోరపాటుతో ఫెయిల్ అవుతుంది.
గందుకే రాజకీయ నాయకులు, పోటీ చేసే స్వతంత్ర అభ్యర్థులు ఓటు అడగటంతో పాటుగా ఓటు ఎలా వేయాలనేది అర్థమయ్యేలా చెప్పాలని ఎంతో మంది రాజకీయ నిపుణులు చెబుతుంటారు. అలాగే ఓటర్లు కూడా ఎంత సేపు మన కులమా ? మన జిల్లా వాడా ? మంచి పలుకుబడి ఉందా? అనే కోణంలో కాకుండా ఈ వ్యక్తితో నిరుద్యోగులకు, పేద ప్రజలకు ఏవిధంగా లాభం జరుగుతుందని ఆలోచించి ఓటు వేయాలని చెబుతుంటారు. అలాగే ఆ ఓటును ఆశామషిగా తీసుకోకుండా, ఓటు ఫెయిల్ కాకుండా వేయాలని పలువురు చెబుతున్నారు.