తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి ఈటల రాజేందర్ కమలం గూటికి చేరారు. ఈ రోజు ఉదయం ఢిల్లీకి చేరుకున్న ఈటల.. కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్, రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జి తరుణ్చుగ్ సమక్షంలో కాషాయ కండువా కప్పుకొన్నారు. ఈటలతో పాటు మాజీ ఎంపీ రమేశ్ రాథోడ్, మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్రెడ్డి, మాజీ జడ్పీ ఛైర్పర్సన్ తుల ఉమ, ఆర్టీసీ కార్మిక సంఘ నేత అశ్వత్థామరెడ్డి సహా పలువురు ఉస్మానియా ఐకాస నేతలు సైతం కమలంలో చేరారు. వీరందరికీ బీజేపీ పార్టీ ప్రాథమిక సభ్యత్వాన్ని ధర్మేంద్ర ప్రధాన్ అందించారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి కిషన్రెడ్డి, భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, తెలంగాణ భాజపా అధ్యక్షుడు బండి సంజయ్ తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ ప్రభుత్వంలో ఈటల కీలక పాత్ర పోషించారనీ, రాష్ట్ర ఆర్థిక, వైద్యఆరోగ్యశాఖ మంత్రిగా ఆయన సేవలందించారని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఈటలపై ప్రశంసలు కురిపించారు. ఈటల వంటి నేతల చేరికతో భాజపా బలపడుతోందన్నారు. రాష్ట్రంలో పార్టీ అధినాయకత్వం పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా పనిచేస్తాననీ, తెలంగాణలో పార్టీని మరింత ప్రజల్లోకి తీసుకెళ్లడానికి కృషి చేస్తానని ఈటల అన్నారు. రానున్న కాలంలో రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి బీజేపీలోకి చేరికలు ఉంటాయని తెలిపారు.