• ఇప్పటికే భూకంపంతో అతలాకుతలం.. ప్రస్తుతం భారీ వర్షాలు
దర్వాజ-అంతర్జాతీయం
Earthquake in Haiti: కరేబియన్ దేశం హైతీ పై ప్రకృతి ప్రకోపం కొనసాగుతోంది. ఇప్పటికే భూకంపంతో అతలాకుతలం అయిన హైతీలో ప్రస్తుతం భారీ వర్షాలు ముంచెత్తాయి. గత శనివారం సంభవించిన భూకంపం కారణంగా చనిపోయిన వారి సంఖ్య 2 వేలు దాటింది. శిథిళాల కింద చిక్కుకున్న వారి కోసం సహాయ చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. భూకంపం కారణంగా లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. 10 వేల మందికి పైగా తీవ్రగాయాలతో ఆస్పత్రి పాలయ్యారు.
భూకంపం కారణంగా అల్లాడుతున్న హైతీని ప్రస్తుతం భారీ వర్షాలు ముంచెత్తడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. తుఫాను ప్రభావంతో దేశంలోని పలు ప్రాంతాల్లో కుండపోత వర్షం కురుస్తోంది. దీంతో సహాయక చర్యలకు సైతం విఘాతం కలుతోందని అధికారులు చెబుతున్నారు. ఇది వరకు సునామీ వచ్చే అవకాశముందని హెచ్చరించిన యూఎస్ నేషనల్ హరికేన్ సెంటర్ ఫ్లాష్ అండ్ అర్బన్.. తాజాగా భారీ వర్షాల కారణంగా వరదలు సంభవించే అవకాశాలు అధికంగా ఉన్నాయని హెచ్చరించింది.
ప్రస్తుతం కురుస్తున్న వర్షాల కారణంగా భూకంప సహాయ చర్యలకు ఆటంకం కలుగుతున్నదని అధికారులు చెబుతున్నారు. భూకంప ప్రభావిత ప్రాంతాల్లో అత్యవసర పరిస్థితి విధించడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ప్రజలు వాపోతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో తాగడానికి నీరు, తినడానికి ఆహారం కోసం ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా, హైతీ రాజధాని పోర్ట్ వో ప్రిన్స్కు పశ్చిమాన 160 కిలోమీటర్ల దూరంలో నైరుతి దిశలో శనివారం తెల్లవారు జామున 7.2 తీవ్రతతో భూకంపం సంభవించిన సంగతి తెలిసిందే.