రైతన్న ఉద్యమం.. 111వ రోజు
- రైతులతో మరోమారు చర్చిస్తాం: కేంద్రమంత్రి రాజ్నాథ్ సింగ్
- చర్చలకు సిద్ధంగానే ఉన్నాం: రైతు సంఘాలు
దర్వాజ-న్యూఢిల్లీ
ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా దేశరాజధాని సరిహద్దులో రైతులు చేస్తున్న ఉద్యమం 111వ రోజుకు చేరుకుంది. కేంద్రం తీసుకువచ్చిన మూడు వివాదాస్పద సాగు చట్టాలను ఉపసంహరించుకోవాలని రైతులు ఉద్యమిస్తున్నారు. ఈ నిరసనల్లో నేపథ్యంలోనే ఇప్పటివరకు 300 మందికి పైగా అన్నదాతలు అమరులయ్యారని పలు నివేదికలు పేర్కొన్నాయి. ఢిల్లీ-హర్యానా సరిహద్దు ప్రాంతాలైన సింఘూ, టిక్రీ, ఢిల్లీ-ఉత్తరప్రదేశ్ సరిహద్దు ఘాజీపూర్, పల్వాల్, హర్యానా-రాజస్థాన్ సరిహద్దు షాజహాన్ పూర్ ఉద్యమ కేంద్రాల్లో రైతులు ఆందోళన కొనసాగుతోంది.
అలాగే, రైతు ఉద్యమ క్రమంలోనే పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్, మహారాష్ట్ర, రాజస్థాన్ రాష్ట్రాల్లో కిసాన్ మహా పంచాయతీలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. ఒడిశాలోని కిసాన్ అధికార్ యాత్ర గజపతి జిల్లాలోని కాశీపూర్కి చేరుకుంది. దీనికి స్థానికుల భారీ స్పందన లభించింది. అలాగే, ఉత్తరాఖండ్ నుండి ప్రారంభమైన కిసాన్ మజ్దూర్ జాగృతి యాత్ర 11వ రోజు కూడా కొనసాగింది. మంగళవారం ఈ యాత్ర బిహార్కి చేరింది.
మరో సారి రైతులతో చర్చిస్తాం: కేంద్రమంత్రి రాజ్నాథ్ సింగ్
నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న ఉద్యమం మరింత ఉధృతం అవుతున్న నేపథ్యంలో కేంద్రం రైతులతో చర్చలు జరిపేందుకు సిద్దమవుతున్నదనే సంకేతాలు ఇచ్చింది. దీనికి అనుగుణంగా మరోదఫా అన్నదాతలో చర్చలు జరిపేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ మీడియాతో వెల్లడించారు.
చర్చలకు సిద్ధంగానే ఉన్నాం: రైతు సంఘాలు
ప్రభుత్వం చర్చలు జరపడానికి వస్తే తాము సిద్ధంగా ఉన్నామంటూ రైతు సంఘాలు పేర్కొన్నాయి. దీనిపై రైతు సంఘం నేత రాకేశ్ టికాయత్ మాట్లాడుతూ.. నూతన సాగు చట్టాల రద్దు, విద్యుత్ సవరణ బిల్లు-2020 వెనక్కి తీసుకోవడం, పర్యావరణ ఆర్డినెన్స్ లో రైతు వ్యతిరేక నిబంధనలు తొలగించడమే తమ ప్రధాన ఎజెండాగా ఉంటుందని స్పష్టం చేశారు. చర్చల ద్వారా సమస్యలకు పరిష్కారం లభించకపోతే రానున్న రోజుల్లో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తూ.. ఉత్తరప్రదేశ్ లోని నోయిడా రోడ్లను బ్లాక్ చేస్తామని టికాయత్ హెచ్చరించారు.
Share this content: