- రూ.4 కోట్ల నజరానా ప్రకటించిన హర్యనా సర్కారు
దర్వాజ-న్యూఢిల్లీ
టోక్యో ఒలింపిక్స్ లో భారత్ కు మరో పతకం లభించింది. పురుషుల 57 కేజీల ఫ్రీస్టయిల్ రెజ్లింగ్ విభాగంలో భారత రెజ్లర్ రవికుమార్ దహియాకు రజతం లభించింది. స్వర్ణం కోసం జరిగిన పోరులో రవికుమార్.. రష్యా ఒలింపిక్ కమిటీ (ఆర్వోసీ) జట్టుకు చెందిన జవూర్ ఉగుయేవ్ చేతిలో ఓటమిపాలయ్యాడు. ఈ ఫైనల్ పోరులో ఉగుయేవ్ కు 7 పాయింట్లు దక్కగా, రవికుమార్ 4 పాయింట్లే సాధించి రజతంతో సరిపెట్టుకున్నాడు.
తాజా పతకంతో టోక్యో ఒలింపిక్స్ లో భారత్కు రెండో రజత పతకం లభించినట్టైంది. మొత్తం టోక్యో ఒలంపిక్స్ లో భారత్కు ఐదు పతకాలు దక్కాయి. కాగా, రజతం సాధించిన రవికుమార్ దహియాపై హర్యానా సర్కారు కాసుల వర్షం కురిపించింది. ఏకంగా రూ.4 కోట్ల నగదు నజరానా ప్రకటించింది. దీంతో పాటు క్లాస్-1 ఉద్యోగం, 50 శాతం రాయితీతో స్థలం అందిస్తామని తెలిపింది. అలాగే, రవి కుమార్ స్వస్థలం నహ్రీలో రెజ్లింగ్ ఇండోర్ స్టేడియం నిర్మిస్తామని పేర్కొంది.