- ఏప్రిల్ నాటికి 7.97కు చేరుకున్న జాతీయ నిరుద్యోగిత రేటు
- భవిష్యత్తులో ఉద్యోగ కల్పన పెను సవాలన్న సీఎంఐఈ
- మరో సంక్షోభం దిశగా భారత్ !
దర్వాజ-న్యూఢిల్లీ
భారత్లో కరోనా వైరస్ విజృంభణ ఇంకా కొనసాగుతూనే ఉంది. భారీ స్థాయిలో కొత్త కేసులు, మరణాలు నమోదవుతూనే ఉన్నాయి. కోవిడ్-19 ఉధృతి కారణంగా ఇప్పటికే దేశ ఆరోగ్య రంగం సంక్షోభంలోకి జారుకోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి తరుణంలో దేశంలో మరో సంక్షోభం సవాలు విసురుతోంది.
కరోనా సృష్టిస్తున్న విపత్తు కారణంగా దేశంలో ఉపాధి కరువై.. యావత్ ప్రజానీకాన్ని ఆర్థిక సంక్షోభంలోకి నెడుతోంది. కేవలం ఒక్క నెలలోనే అధికారిక డేటా ప్రకారం దాదాపు 75 లక్షల మంది ఉపాధిని కోల్పోయారు. అనాధికారిక రంగంలో పనిచేస్తున్న వారి సంఖ్య భారీగానే ఉండే అవకాశం ఉందని పలు సర్వేలు పేర్కొంటున్నాయి.

కరోనా పంజా నేపథ్యంలో దేశంలోని చాలా రాష్ట్రాలు ఇప్పటికే అనేక ఆంక్షలు, లాక్డౌన్ చర్యలు విధించాయి. మరికొన్ని రాష్ట్రాలు సైతం ఇదే బాటలో ముందుకు సాగుతున్నాయి. అనేక వ్యాపార మార్కెట్లు, సంస్థల కార్యకాలపాలు నిలిచిపోయాయి. ఇదివరకే దేశ ఆర్థిక పరిస్థితి సైతం కుదేలవుతూ వస్తోంది. దీని కారణంగా దేశవ్యాప్తంగా లక్షలాది మంది తమ ఉద్యోగాలను కోల్పోయారని సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ (సీఎంఐఈ) పేర్కొంది.
గడిచిన ఏప్రిల్లో ఒక్క నెలలోనే దేశవ్యాప్తంగా 75 లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయారని సీఎంఐఈ ఎండీ, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మహేశ్ వ్యాస్ తెలిపారు. ఫలితంగా నిరుద్యోగిత రేటు మరింత పెరిగిందన్నారు. దేశంలో తాజాగా చోటుచేసుకుంటున్న పరిస్థితులు భవిష్యత్తులో ఉద్యోగ కల్పనకు పెను సవాలుగా మారే అవకాశముందని ఆయన అభిప్రాయపడ్డారు. దేశం వైద్యారోగ్య సేవల ఒత్తిడిని ఎదుర్కొంటుందనీ, మే నెలలో ప్రభావం మరింత ఎక్కువ ఉండవచ్చునని ఆయన అంచనా వేశారు.

మార్చిలో 6.50 శాతంగా ఉన్న జాతీయ నిరుద్యోగిత రేట ఏప్రిల్ నాటికి 7.97 శాతానికి చేరుకున్నట్టు కేంద్ర ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. పట్టణాల్లో నిరుద్యోగిత రేటు 9.13 శాతంగా ఉంటే గ్రామీణ ప్రాంతాల్లో 7.13 శాతంగా ఉంది. కరోనా కట్టడికి పలు రాష్ట్రాలు అమలు చేస్తున్న ఆంక్షలు, లాక్డౌన్ చర్యల ప్రభావం ఉద్యోగాలపై పడిందని పలు సర్వేలు స్పష్టం చేస్తున్నాయి.
ఇదిలా ఉండగా.. కరోనా కట్టడికి మెరుగైన వేగవంతమైన చర్యలు తీసుకోకపోవడం, కోవిడ్-19 టీకాలు నెమ్మదిగా వేయడం వంటి అంశాలు భారత ఆర్థిక వ్యవస్థ పునురుద్ధరణ చర్యలను దెబ్బతీసిందని ప్రముఖ ఆర్థక వేత్త రాహుల్ బజోరియా తన పరిశోధన పత్రంలో వెల్లడించారు.