బ్రెజిల్ అధ్యక్షుడిపై నేర అభియోగాలు
• కరోనా సమయంలో ప్రజల ప్రాణాలతో చెలగాటం
• ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేశారు: సెనేట్ కమిటీ
• హేగ్ అంతర్జాతీయ కోర్టుకు వెళ్లడంపై చర్చ
దర్వాజ-అంతర్జాతీయం
Jair Bolsonaro: మానవాళికి వ్యతిరేకంగా పనిచేస్తూ.. కరోనా సమయంలో నిర్లక్ష్యం, అలసత్వం వహించి లక్షల మంది ప్రాణాలు పోవడానికి కారణమయ్యాడంటూ బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బోల్సోనారోపై ఆ దేశ సెనేట్ కమిటీ తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేసింది. ఆయనపై క్రిమినల్ అభియోగాలు మోపాలని తన నివేదికలో సిఫార్సు చేసింది. కరోనా సమయంలో ప్రభుత్వ పనితీరు, బోల్సోనారో.. కోవాగ్జిన్ టీకాలు సహా పలు విషయాల్లో అక్రమాలకు పాల్పడ్డారంటూ తీవ్ర ఆరోపణలు రావడంతో దానిపై దార్యప్తు చేయడానికి సెనేట్ సభ్యులతో ప్రత్యేక కమిటీలు ఏర్పడ్డాయి.
సుదీర్ఘ దర్యాప్తు
దాదాపు ఆరు నెలల సుదీర్ఘ దర్యాప్తు అనంతరం సెనేట్ కమిటీ ఈ నివేదికను రూపొందించింది. ఇందులో కరోనా తీవ్రతను తక్కువ చేసి చెప్పడం, అంతర్జాతీయ కరోనా మార్గదర్శకాలను పట్టించుకోకపోవడం, టీకాల సేకరణపై దృష్టి సారించకపోవడం, ఇందులోనూ అక్రమాలకు పాల్పడటం, ప్రజాధనం దుర్వినియోగ్నం వంటి 9 నేర అభియోగాలను బోల్సోనారోపై మోపాలని పేర్కొంది.
అక్టోబర్ 26న ఓటింగ్
ఉద్రిక్త వాతావరణం నెలకొని ఉన్న ఛాంబర్లో తాజాగా పార్లమెంటరీ కమిషన్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీపీఐ) ప్రతినిధి సెనేటర్ రెనన్ కాల్హీరోస్ తన నివేదికను 11 మంది సభ్యుల ప్యానెల్కు సమర్పించారు. దీని ఆమోదం కోసం ఈ నెల 26న ఓటింగ్ జరగనుంది. దాదాపు 1,200 పేజీల ఈ నివేదిక వివరాలను వెల్లడిస్తూ.. బ్రెజిల్లో కరోనా విజృంభణకు, ప్రజలు ప్రాణాలు కోల్పోవడానికి ప్రధాన అపరాధిగా బోల్సోనారోను పేర్కొంది. ఆయనపై మోపిన 9 నేర అభియోగాలకు బాధ్యత వహించాలనీ, ఇది జైలు శిక్షకు దారి తీస్తుందని స్పష్టం చేసింది.
‘‘బోల్సోనారోపై మోపిన నేరాలకు గానూ అధ్యక్షుడి అభిశంసనకు దారితీస్తుంది. దాదాపు 40 ఏండ్ల జైలు శిక్ష పడవచ్చు. ఆయన అనేక నేరాలకు పాల్పడ్డాడు. వాటికి మూల్యం చెల్లించకతప్పదు’’ అని సెనేటర్ ఒమర్ అజీజ్ అన్నారు. కాగా, కరోనా సంక్షోభంలో బోల్సోనారో ప్రభుత్వం ఎలా నిర్లక్ష్యంగా వ్యవహరించిందో సాక్ష్యాలతో సహా ఈ నివేదిక పేర్కొంది. ప్రభుత్వం నిర్లక్ష్యంగా నడుచుకోకుండా ఉండివుంటే 40 శాతం కేసులు రాకుండా ఉండటం సహా దాదాపు 1.20 లక్షల ప్రాణాలు పోకుండా వుండేవని రెనన్ పేర్కొన్నారు.
మొత్తం 65 మందిపై అభియోగాలు
అయితే, బోల్సోనారో అత్యధిక ఆరోపణలు ఎదుర్కొన్నప్పటికీ.. ఈ నివేదికలో 29 రకాల నేరాలకు సంబంధించి 65 మంది వ్యక్తులపై అభియోగాలు మోపబడ్డాయి. ఇందులో బోల్సోనారో కుమారులతో పాటు ఫెడరల్ సెనేటర్ ప్లావియో, ఫెడరల్ డిప్యూటీ ఎడ్వర్డో, రియో సిటీ కౌన్సిలర్ కార్లోస్, నలుగురు ఫెడరల్ మంత్రులు, ముగ్గురు మాజీ మంత్రులు, ముగ్గురు ఫెడరల్ డిప్యూటీ సభ్యులు ఉన్నారు. అలాగే, కోవాగ్జిన్ టీకా ఒప్పందలో భాగ్నమైన రెండు బ్రెజిలియన్ కంపెనీలు ప్రెసిసా మెడికామెంటోస్, వీటీసీలాగ్ కూడా ఉన్నాయి. సీపీఐ పేర్కొన్న మొత్తం 65 మందిలో 11 మంది కోవాగ్జిన్ అక్రమాలకు పాల్పడ్డారు.
కోవాగ్జిన్ ఒప్పందంతోనే..
బోల్సోనారో అక్రమాలు వెలుగులోకి రావడానికి ప్రధాన కారణం కోవాగ్జిన్ అని చెప్పాలి. ఎందుకంటే అప్పటికీ ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి ఆమోదం లభించని ఈ టీకాల కోనుగోలుకు భారత్ బయోటెక్తో ఒప్పందం చేసుకోవడంతో దీనిపై మీడియా సంస్థలు లోతుగా కూపీ లాగాయి. అంతకు ముందు టీకాల (విజిల్ బ్లోయర్) విషయంలో బ్రెజిల్ ప్రభుత్వం అక్రమాలకు పాల్పడటం మీడియా సంస్థలు మరింత లోతుగావెళ్లి అక్రమాలను వెలుగులోకి తీసుకువచ్చాయి. ప్రజల నుంచి ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత, ఆందోళనలు చెలరేగడంతో ఈ కుంభకోణంపై దర్యాప్తుకు సీపీఐ కమిటీ ఏర్పడింది.
కోవాగ్జిన్పై కీలక వ్యాఖ్యలు
కోవాగ్జిన్పై సీపీఐ నివేదిక విస్తుపోయే విషయాలను ప్రస్తావించింది. భారత కోవాగ్జిన్ టీకా కొనుగోలు నిర్ణయం బ్రెజిల్ ప్రభుత్వ అత్యున్నత స్థాయిలో రూపొందించిన అవినీతి పథకం అని పేర్కొంది. బ్రెజిలియన్ డ్రగ్ రెగ్యులేటరీ (ఏఎన్వీఐఎస్ఏ) ప్రమాణాలకు కోవాగ్జిన్కు ఆర్హత లేదు. అయితే, అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ ప్రత్యేక బిల్లు తీసుకువచ్చి.. కోవాగ్జిన్ అత్యవసర వినియోగానికి ఆమోదించారని పేర్కొంది. అలాగే, గ్నతేడాది జనవరి 8న భారత ప్రధాని మోడీకి బోల్సోనారో పంపిన లేఖను సైతం ప్రస్తావించింది.
అంతర్జాతీయ న్యాయస్థానం ముందుకు..
ఫైజర్, జాన్సన్, మోడర్నా కరోనా టీకాలు అందుబాటులో ఉన్నా.. అప్పటికీ మూడో దశ క్లినికల్ ట్రయల్స్ పూర్తికాని కోవాగ్జిన్ కొనుగోలుకు బ్రెజిల్ సర్కారు నిర్ణయం తీసుకోవడాన్ని కూడా నివేదిక ప్రస్తావించింది. సెనేట్ నివేదికను 11 సభ్యుల కమిషన్ ఆమోదం తెలిపితే.. ఆ తర్వాత ప్రాసిక్యూటర్ జనరల్ (పీజీఆర్), స్పీకర్కు పంపబడుతుంది. అయితే, ప్రస్తుతం ఉన్న పీజీఆర్ అగస్తో అరాస్, స్పీకర్ ఆర్థర్ లిరాలు.. బోల్సోనారోకు దగ్గరి సంబంధం కలిగిన వ్యక్తులు కావడంతో తదుపరి అంశాలు ముందుకు సాగడంపై నీలినీడలు కమ్మూకున్నాయని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. సీపీఐ సుప్రీంకోర్టుకు వెళ్లే అవకాశాలున్నాయి. హేగ్లోని అంతర్జాతీయ క్రిమినల్ కోర్టుకు వెళ్లడం గురించి ఇప్పటికే చర్చ జరుగుతోంది.
ప్రశ్నించినందుకు దాడిచేసిన ఎమ్మెల్యే.. వీడియో వైరల్
ఉత్తరాఖండ్పై ప్రకృతి ప్రకోపం.. 47కు పెరిగిన మృతులు
తెలంగాణ దళితబంధుకు ఈసీ బ్రేకులు
కేరళలో భారీ వర్షాలు.. 25 మంది మృతి
జమ్మూకాశ్మీర్లో ఉగ్రవాదుల టార్గెట్..
Share this content: