Breaking
Sat. Jun 28th, 2025

ప్రశ్నించే గళం కావాలె!

వ‌నిత‌ల్లారా.. ఈ రోజుకు ఒక ప్ర‌ముఖ్య‌త ఉంది. అది మీరు అనుకునేట్లు కేక్ క‌ట్ చేసి, ఇంట్లో టీవీ ముందు కూర్చుని ఒక్క రోజు సేద తీరుడు కాదు. మీ గ‌ళాన్ని గ‌ట్టిగా స‌మాజానికి తెలియజేయాల్సిన రోజు ఇది. పోరాటం గురించి బ‌ల్లగుద్ది చెప్పుకోవ‌ల్సిన దినం ఇది. దాన్ని గురించి తెలుసుకోండి. తెలియ‌ని వారికి తెలిసేలా చెప్పండి. అప్పుడు మీకు ఏం చేయాల‌నిపిస్తే అది చేయండి.

మార్చ్ 8 శ్రామిక మహిళల పోరాట దినం. 1910లో కోపెన్ హెగ్ లో క్లార Jetkin నాయకత్వంలో ప్రారంభమైనది.ఈ పోరాటం ముఖ్య ఉద్దేశం Jowli పరిశ్రమల్లో పనిచేసే మహిళలకు సంబంధించింది. ప‌ని గంట‌ల‌తో సంబంధం లేకుండా ప‌ని చేయించుకునే పారిశ్ర‌మిక వేత్త‌లు వ్య‌వ‌హ‌రించే తీరుకు వ్య‌తిరేకంగా మ‌హిళ‌లు పోరాటం చేసిన రోజుకు సంబంధించింది.

రోజుకు 8 గంటలు మాత్ర‌మే ప‌ని చేయించుకోవాల‌ని కొట్లాడి విజ‌యం సాధించిన రోజుకు సంబంధించింది.దాని ఫ‌లితంగానే నేడు 8గంటల పని నియమం అమలులోకి వచ్చింది. అలా పోరాటం చేసి విజ‌యం సాధించారు కాబ‌ట్టే.. మార్చ్ 8ని మహిళలు సాధించిన పోరాట విజయంగా చెబుతారు. కానీ రానురాను ఆ పోరాట దినం కాస్తా.. ఉత్సవంగా మారిపోయింది. ఏ విష‌యంలోకి అయినా ప్రభుత్వాలు దూరితే అది దాని రూపాన్ని కోల్పోవాల్సిందే అనేందుకు ఇదొక చ‌క్క‌టి ఉదాహరణ.

మహిళలు వారి సమస్యలను మార్చ్ 8 స్ఫూర్తితో చర్చించుకుని పోరాటం చేయాలి. కానీ అలా జ‌ర‌గ‌కుండా ప్రభుత్వాలు కుట్ర ప‌న్నిన్నాయి. అందులో భాగంగానే వారికి ఒక పండగ వాతావరణాన్ని క‌ల్పిస్తున్నాయి. అలాగే ఇంట్లో కూడా ఈ ఒక్కరోజు పని నుంచి విముక్తిని ఇస్తున్నారు. దీంతో రోజు వారి చేసే చాకిరి పక్కకు పోతుంది. ఈ చాకిరి, పోరాటాల గురించి మాట్లాడే అవకాశం లేకుండా పోతుంది.

lets-question1 ప్రశ్నించే గళం కావాలె!

దీనికితోడు కేంద్ర ప్రభుత్వం కొత్తగా 8గంటల పని దినాన్ని కాస్త 12 గంటలకు పెంచేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. దీన్ని ఆమోదించెందుకు వారానికి 4 రోజులే పని చేయండి. మిగిలిన‌ 3 రోజులు సెలవు తీసుకోండి అంటూ మభ్యపెడుతోంది. ఇది క‌నుక జ‌రిగితే 12 గంటల పని దినంతో మహిళలు వెట్టిచాకిరి చేయాల్సి వస్తుంది.

ఇప్పటికే ప్రయివేటు ఉద్యోగం చేసే మహిళలు 9 గంటల ప‌ని చేస్తున్నారు. దానికి తోడు ట్రాఫిక్ లో రాను, పోను జర్నీకి 3 గంటలు అంటే మొత్తంగా 12 గంటలు పని చేస్తున్నారు. అదనంగా తీసుకొస్తున్న కొత్త పాలసీ ప్రకారం 12 పని అంటే మహిళలు ఉద్యోగాలు మానేసి ఇంటికి పరిమితం అయిపోవ‌డ‌మే జ‌రుగుతుంది. కేంద్రం ఈ కొత్త పద్ధతిని అమలులోనికి తీసుకొస్తే.. పాత కాలంలో లాగే మహిళను వంటింటికీ పరిమితం చేసినట్టే అవుతుంది.దీంతో ఎందరో మహనీయుల పోరాటం వృధా అవుతుంది. మార్చ్ 8 అస‌లు సందర్భం నిరుగారిపోతుంది.

ఏం చేయాలంటే..

ప్రభుత్వాలు మహిళాపక్షపాతి అని మాటల్లో చెప్పడం కాదు. ఒకరోజు సెలవు దినం ప్ర‌క‌టించ‌డం కాదు. వారికి సమాజంలో ఒక గౌరవాన్ని ఇవ్వాలి. రాజకీయంగా వారికి స్థానాన్ని కల్పించాలి. పని ప్రాంతాల్లో లైంగిక వేధింపులకు చెక్ పెట్టాలి. కేక్ కటింగ్ లు ఆపి మార్చి 8 సందర్భాన్ని గొంతువిప్పి మాట్లాడే స్పూర్తిని నింపాలి.

తమ కుటుంబంలోని మహిళలను గాజు బొమ్మలా కాకుండా సమాజంలో ఉండే మంచిచెడులను ఎలా ఎదుర్కోవాలో చెప్పాలి. దానికి అవసరమైన విద్యను నేర్పాలి. మహిళల్లో ఆత్మవిశ్వాసం అంతులేనంత ఉంటుంది. మీకు చేత‌నైతే ఆ ఆత్వ‌విశ్వాసాన్ని మ‌రింత పెంచెందుకు కృషి చేయాలి. లేక‌పోతే గ‌మ్మున ఉండాలి. కానీ వాళ్ల ఆత్మ విశ్వాసాన్ని త‌గ్గించే ప‌నులు మాత్రం చేయొద్దు.

మగవారి చేష్టలతో ఆమెను నూన్యత భావంలోకి నెట్టివేశారు. స‌మ‌యం మించిపోలేదు ఇప్ప‌టికైనా ఆమెలో ఉన్న‌ ఆత్మవిశ్వాసన్నీ తట్టి లేపండి . అప్పుడు ఆమె ఈ సమాజ నిర్మాణంలో సగభాగాన్ని నేనంటూ నిలుస్తుంది. అప్పుడే ఈ రోజుకు ఒక అర్థం, ప‌ర‌మార్థం ఉంటుంది.

swathi ప్రశ్నించే గళం కావాలె!

ఎన్. స్వాతి

జర్నలిస్ట్, హైదరాబాద్.

మీ అభిప్రాయాల‌ను ప్ర‌పంచంతో పంచుకోవాల‌నుకుంటున్నారా? అయితే ఇంకెందుకు ఆల‌స్యం.. న‌లుగురిని ఆలోచింప‌జేసే ఏ ఆర్టిక‌ల్ ను అయినా మా వెబ్సైట్ లో ప‌బ్లిష్ చేసేందుకు మేము సిద్ధంగా ఉన్నాం. మీరు చేయాల్సిందల్లా మీ ఆర్టిక‌ల్స్ ను darvaaja@gmail.com కు మీ ఫొటో వివరాలతో పాటుగా మెయిల్ చేయడమే..

మగువకు మరణ సంకెళ్లు.. తొలగేదెప్పుడు ?

మ‌నం మారేదెప్పుడు ?

అవును వాళ్లు ‘గే’నే.. నీకు ఎందుకంత నొప్పి?

ప్రేమంటే సంపేసుడేనా ?

Related Post