చైనాలోని వూహాన్ నగరంలో వెలుగు చూసిన కరోనా వైరస్.. అతి తక్కువ కాలంలోనే యావత్ ప్రపంచాన్ని చుట్టిముట్టేసింది. భారత్లోకి సైతం ఆ మహమ్మారి ఎంటరైంది. అప్పటికే కరోనా విజృంభిస్తున్న పలు దేశాలు ఆంక్షలు అమల్లోకి తీసుకువచ్చాయి. దీంతో అక్కడి ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు.
ఇండియా లాక్డౌన్ !


ఇలాంటి తరుణంలో భారత్లోనూ ఆంక్షలు అమల్లోకి తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనిలో భాగంగా 2020 మార్చి 23న దేశంలో జనతా కర్ఫ్యూ పాటించాలని ప్రధాన మంత్రి నరేంధ్ర మోడీ పిలుపునిచ్చారు. అప్పటికీ దేశంలో 500 లోపు కేసులు, మరణాలు సైతం 50 లోపు మాత్రమే ఉన్నాయి. 2020 మార్చి 24 ప్రధాని మాట్లాడుతూ.. 21 రోజుల పాటు (మార్చి 25 నుంచి ఏప్రిల్ 14వరకు) దేశంలో లాక్డౌన్ విధిస్తున్నామని ప్రకటించారు.
అన్ని బంద్ !

దీంతో ఒక్కసారిగా దేశంలో లాక్ డౌన్ విధిస్తూ.. దేశంలోని అత్యవసర సేవలు అగ్నిమాపక, పోలీసులు, అత్యవసర రవాణా సేవలకు మినహాయింపును ఇచ్చారు. మిగిలిన అన్ని అన్ని రవాణా సర్వీసులు, సేవలు, పరిశ్రమలు, వాణిజ్య కార్యకలాపాలు నిలిచిపోయాయి. 21 రోజులు దాటింది అయినా .. కరోనా ప్రభావం తగ్గలేదు. దీంతో మళ్లీ లాక్ డౌన్ పొడిగిస్తూ వచ్చింది ప్రభుత్వం. అయితే, ఆర్థిక వ్యవస్థ మరింత దిగజారుతుండటంతో.. ఐదు దశలుగా లాక్ డౌన్ సడలిపులు ప్రకటించింది.

అయితే, మొదటిసారి లాక్ డౌన్ ప్రకటించిన రోజున.. ఏడాది దాటిన తర్వతా పరిస్థితులను గమనిస్తే.. ఇందులో చాలా అంశాలే కనిపిస్తాయి. అప్పుడు దేశంలో అత్యల్ప కేసులు ఉన్నాయి. ప్రస్తుతం రికార్డు స్థాయిలో కేసులు పెరుగుతున్నాయి. మళ్లీ కరోనా కల్లోలం మొదలైంది. ఇప్పటికీ లాక్డౌన్కు సంబంధించి ప్రభుత్వంపై చాలానే ఆరోపణలు వినిపిస్తూనే ఉన్నాయి. సరైనా సౌకర్యాలు కల్పించకుండా.. ముందస్తు అంచనాలు, ఏం జరుగుతుందో ఆలోచించకుండా దేశవ్యాప్త లాక్డౌన్ ప్రకటించారని ఇప్పటికీ ప్రతిపక్షాల ఆరోపణలు గుప్పిస్తూనే ఉన్నాయి.
వలస జీవుల బతుకులు.. బుక్కెడు బువ్వ కరువైంది !

దీనికి కారణం లేకపోలేదు. లాక్డౌన్ సమయంలో దేశాన్ని కాకుండా యావత్ ప్రపంచాన్ని కదిలించిన అంశం వలస కార్మికులు. ఒక్కసారిగా లాక్డౌన్ వచ్చిచేరడంతో దిక్కుతోచని స్థితిలో వలస జీవులు రోడ్డున పడ్డారు. వారిలో ప్రభుత్వం నుంచి సాయం అందని అభాగ్యాలు కోట్లల్లో ఉన్నారు. తినడానికి తిండి లేక, తాగడానికి నీరు లేక ఎండవానలు లెక్కచేయకుండా రవాణా సౌకర్యాలు లేకపోవడంతో వందలాది కీలోమీటర్లున్న సొంత గ్రామాలకు కాలినడకనే బయలు దేరారు. ఈ క్రమంలో దాదాపు వేయి మందికి పైగా మార్గమధ్యలోనే ప్రాణాలు కోల్పోయారని పలు సర్వేలు వెల్లడించాయి. హృదయాలను కలిచివేసే దృశ్యాలు ఇప్పటికీ కండ్ల మందు మెదులుతున్నాయని అప్పటి బాధితులు పేర్కొంటున్నారు. ఇప్పటికీ తమ జీవితాల్లో వెలుగు రాలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఆర్థిక వ్యవస్థ అల్లకల్లోలం !


కరోనా మహమ్మరి లాక్డౌన్ దేశ ఆర్థిక వ్యవస్థపై సృష్టించే కల్లోలం గురించి ప్రభుత్వం ముందుగా అంచనాకు రాకుండానే లాక్ డౌన్ విధించిందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఆర్థిక వ్యవస్థ కుదేలు కాకుండా చర్యలు తీసుకోని కారణంగా చరిత్రలో ఎన్నడు లేని విధంగా దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధి మైనస్ లోకి పడిపోయింది. ఇప్పటికీ ఆ సంక్షోభం నుంచి వాణిజ్య, వ్యాపార సంస్థలు కోలుకోలేదని పేర్కొంటున్నారు. జనవరిలోనే జీడీపీ వృద్ధి రేటు 3.1 శాతానికి పడిపోగా.. ఆ తర్వాత మరింత దిగజారింది. యువతపై తీవ్ర ప్రభావమే పడింది. అప్పటికే ఉపాధిలేక కొట్టుమిట్టాతున్న యువతపై లాక్డౌన్ కోలుకోలేని దెబ్బ కొట్టింది. కొత్త ఉద్యోగాలు రాలేదు. ఉన్న ఉద్యోగాలు పోయాయి. గతేడాది ఏప్రిల్లో నిరుద్యోగిత రేటు 23.5 శాతంగా ఉంది. మేలో 21.7 శాతంగా ఉందని సీఎంఐఈ గణాంకాలు పేర్కొంటున్నాయి. ఇప్పటికీ ఉపాధి పై లాక్డౌన్ ప్రభావం ఉందంటే అతిశయోక్తి కాదు.
మళ్లీ లాక్ డౌన్ !… భయాందోళనలో ప్రజలు !


దేశంలో ప్రస్తుతం మళ్లీ కరోనా పంజా విసురుతోంది. ఓ వైపు వ్యాక్సినేషన్ ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతున్నప్పటికీ వైరస్ ప్రభావం పెంచుకుంటూనే ఉంది. గురువారం ఉదయం కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. దేశంలో కొత్తగా రికార్డు స్థాయిలో 53,476 పాజిటివ్ కేసులు, 251 మరణాలు నమోదయ్యాయి. ఏడాది నమోదైన అత్యధిక కేసులు, మరణాలు ఇవే. దీంతో దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,17,87,534 చేరగా, మరణాల సంఖ్య 1,60,692కు పెరిగింది. ప్రస్తుతం 3,95,192 యాక్టివ్ కేసులు ఉన్నాయి. దీంతో దేశంలోని పలు ప్రభుత్వాలు ఆంక్షలను విధిస్తున్నాయి. దీంతో దేశంలో మళ్లీ లాక్డౌన్ అంశం తెరపైకి వస్తోంది. ఈ క్రమంలోనే ప్రజల్లో మళ్లీ భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. ఎదేమైనప్పటికీ.. అందరూ కలిసి కట్టుగా ఉంటూ.. కరోనా నిబంధనలు తప్పకుండా పాటిస్తేనే ఈ మహమ్మారిని తరిమి కొట్టగలం అనే విషయాన్ని మాత్రం గుర్తెరగాలి.
కరోనా లాక్డౌన్… కన్నీటి దృశ్యాలు !
సైలెంట్ కిల్లర్.. రోజు 40 వేల మంది బలి !
సమ్మర్ స్పెషల్.. పచ్చిమామిడి కాయ జ్యూస్ !