Breaking
Sun. Jun 29th, 2025

Madras High Cour: ప్ర‌జా ప్ర‌యోజ‌నం కోస‌మా? మెరుగైన న్యాయ నిర్వ‌హ‌ణ కోస‌మా?

Madras High Court Chief Justice
Madras High Court Chief Justice

• తీవ్ర చర్చకు తెరలేపిన మద్రాస్‌ హైకోర్టు సీజే బదిలీ
• సుప్రీం కొలీజియం సిఫార్సుల‌పై న్యాయవాదులు ఆగ్రహం
• జస్టిస్‌ సంజీవ్‌ బెనర్జీని ఇక్కడే ఉంచాలంటూ 200 మందికి పైగా న్యాయవాదుల లేఖ

దర్వాజ-చెన్నై
Madras High Court Chief Justice’s transfer: వాక్‌ స్వాతంత్య్రం, లౌకికవాదం, స్వేచ్ఛాయుతమైన ఎన్నిక‌లు, ఆరోగ్య హక్కు, ప్రభుత్వాల జవాబుదారీతనం, దర్యాప్తు సంస్థల తీరు వంటి అంశాలపై అనేక ఉత్తర్వులు ఇచ్చిన మద్రాస్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సంజీబ్‌ బెనర్జీని.. ఈశాన్య రాష్ట్రమైన మేఘాలయకు బదిలీ చేయాలనే సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సులు తీవ్ర చర్చకు దారి తీసింది. ఈ అంశం అనేక ప్రశ్నలను రేకెత్తిస్తోంది. సీజేను బదిలీ చేయాలన్న కోలీజియం సిఫార్సుపై మద్రాస్‌ హైకోర్టు న్యాయవాదులు నిరసన.. ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఈ నేపథ్యంలోనే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ.రమణతో పాటు కొలీజియం సభ్యులకు 200 మందికి పైగా న్యాయవాదులు సంయుక్తంగా లేఖ రాశారని లైవ్ లా నివేదించింది. . ‘‘పదవీ బాధ్యతలు చేపట్టిన 10 నెలల్లోపే బదిలీ చేయడం ప్రజా ప్రయోజనం కోసమా? లేక మెరుగైన న్యాయ నిర్వహణ కోసమా?’’ అంటూ తమ లేఖలో ప్రశ్నించారు. ఏడాదిలో 35 వేలకు పైగా కేసులు దాఖలయ్యే హైకోర్టులో సమర్థవంతమైన కార్యనిర్వాహకుడిగా పేరొందిన న్యాయమూర్తిని నెలకు 70 నుంచి 75 కేసులు నమోదయ్యే హైకోర్టుకు ఎందుకు బదిలీ చేస్తున్నారంటూ ప్రశ్నించారు.

75 మంది న్యాయమూర్తులుండే మద్రాసు హైకోర్టు నుంచి కేవలం ఇద్దరు న్యాయమూర్తులుండే మేఘాలయా హైకోర్టుక బదిలీ చేయడం ఆశ్చర్యం కలిగించే ప్రశ్నలకు తావిస్తున్నదన్నారు. రాష్ట్ర న్యాయవ్యవస్థలో అవినీతిని అరికట్టడానికి, పూర్తి స్వేచ్ఛాయుతమైన, స్వతంత్ర న్యాయవ్యవస్థను నిర్ధారించడానికి జస్టిస్‌ బెనర్జీ హయాంలో ప్రయత్నాలు జరుగుతున్నాయని అందరికీ తెలుస‌ని పేర్కొన్నారు. అవినీతి, అసమర్థత పట్ల ఆయన ఆగ్రహం ప్రశంసించబడింద‌ని న్యాయవాదులు గుర్తు చేశారు.

‘రాష్ట్రంలో న్యాయవ్యవస్థను బలోపేతం చేసే ప్రయత్నాలను ఈ బదిలీ అణిచివేస్తుంది. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా, జస్టిస్‌ బెనర్జీని మేఘాలయ హైకోర్టుకు బదిలీ చేయాలనే నిర్ణయాన్ని కొలీజియం పున:పరిశీలించాలని కోరుతున్నాము’ అని న్యాయవాదులు తమ లేఖ‌లో పేర్కొన్నారు. ఈ తరహా బదిలీ నిజాయితీ కలిగిన న్యాయమూర్తి ప్రతిష్టను దెబ్బతీయడంతోపాటు ప్రజల దృష్టిలో న్యాయవ్యవస్థ ప్రతిష్టను సైతం దిగజారుస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. కాగా, సెప్టెంబరు 16న సుప్రీం కొలీజియం జస్టిస్‌ బెనర్జీని మేఘాలయకు బదిలీ చేయాలని సిఫార్సు చేయ‌గా, ఈ నెల 9న రాష్ట్రపతి ఆమోదం తెలిపారు.

కీల‌క అంశాలు ప్ర‌స్తావించిన నేప‌థ్యం..

మద్రాస్‌ హైకోర్టు ప్రధాన న్యాయ‌మూర్తిగా 10 నెలలే బాధ్యతల్లో ఉన్నా జస్టిస్‌ సంజీబ్‌ బెనర్జీ… కేంద్ర ప్రభుత్వ వ్యాక్సినేషన్‌ విధానం, ఆక్సిజన్‌ కొరతపై విమర్శలు చేశారు. మీడియా, ఐటీ చట్టాన్ని నియంత్రించడానికి కేంద్రం రూపొందించిన నిఘా వ్యవస్థపైనా న్యాయమూర్తి తీవ్ర విమర్శలు చేశారు. అలాగే, కేంద్ర దర్యాప్తు సంస్థల పనితీరు, వాటి స్వతంత్ర గురించి కూడా పలుమార్లు ప్రస్తావించారు. కరోనా సమయంలో ఎన్నిక‌లు నిర్వ‌హించినందుకు ఎన్నిక‌ల సంఘంపై హత్యానేరం మోపాలంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది జస్టిస్‌ సంజీవ్‌ బెనర్జీతో కూడిన ధర్మాసనమే. అలాగే, ఎన్నిక‌ల సమయంలో ఆధార్‌ డేటాను దుర్వినియోగం పైనా వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఆయా అంశాలు, బదిలీ అంశాలు చర్చకు తెరలేపాయి. కాగా, గతంలో మద్రాస్‌ హైకోర్టు సీజేగా విజయ కె. తాహిల్‌రమణిని కూడా మేఘాలయ హైకోర్టుకు బదిలీ చేయడం.. నిరసనగా రాజీనమా చేస్తే వెంటనే రాష్ట్రపతి ఆమోదం తెలుపడం వంటి అంశాలు సరికొత్త చర్చనీయ అంశాలుగా మారాయి.

Terrorist Attack : మ‌ణిపూర్‌లో భ‌ద్ర‌తా కాన్వాయ్ పై ఉగ్ర‌దాడి

Night Time Eating: అర్థరాత్రి తినే అలవాటు మీకుందా? అయితే ఈ ఫుడ్ మాత్రమే తీసుకోండి..

Crime: ఎంతటి అమానుషం.. సంతానం కోసం 16 నెలలుగా యువతిని బంధించి..

Air Pollution: కాలుష్యం.. ప్ర‌పంచంలోనే టాప్‌లో ఢిల్లీ

Tulsi Gowda: అడవి తల్లి బిడ్డకు దక్కిన ‘పద్మం’.. ఆమె కథేంటీ?

పిల్లల్ని కనడంపై ఉపాసన సమాధానం ఇదే..

Kangana Ranaut: ‘1947లో భిక్షం.. 2014లోనే దేశానికి స్వాతంత్య్రం’ : కంగనా రనౌత్

3 Roses: నేను నీ కంటే చాలా పెద్దదాన్ని : పూర్ణ

Related Post