- కొత్తగా 66,358 కరోనా కేసులు
దర్వాజ- ముంబయి
కరోనా వైరస్ దేశంలో తీవ్రంగా విజృంభిస్తోంది. మరీ ముఖ్యంగా మహారాష్ట్రలో మహా మరణ మృదంగాన్ని మోగిస్తున్నది. అక్కడ ఒక్కరోజులోనే 895 మంది ప్రాణాలను కరోనా బలి తీసుకుంది. రాష్ట్రంలో సంభవించిన ఒక్కరోజు మరణాల్లో ఇవే అత్యధికం. ఇదే సమయంలో కొత్తగా 66,350 మంది కరోనా బారినపడ్డారు. దీంతో రాష్ట్రంలో కోవిడ్-19 మొత్తం కేసులు 44,10,085 చేరగా, మరణాలు 66,179కి పెరిగాయి.
కాగా, మహారాష్ట్రలో అంతకు ముందు రోజు 48,700 కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 6,72,434 క్రియాశీల కేసులు ఉన్నాయి. అత్యధికంగా ముంబయి, థానే, పాల్ఘర్, రాయగఢ్, రత్నగిరిలలో 1,76,567 క్రియాశీల కేసులు ఉన్నాయని అధికారిక డేటా చూపిస్తోంది. రాష్ట్రంలో ఇప్పటివరకు 2,62,54,737 పరీక్షలు నిర్వహించగా, అందులో 44,10,085 పాజిటివ్గా నిర్థారణ అయ్యాయి.
మహారాష్ట్రలో కరోనా పాజిటివిటి రేటు 16. 80 శాతంగా ఉంది. రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం 36,69,548 మంది కోలుకున్నారు. దీంతో రికవరీ రేటు 83.21 శాతానికి చేరింది. రాజధాని ముంబయిలో కరోనా వ్యాప్తి ప్రమాదకర స్థాయిలో కొనసాగుతోంది. తాజాగా అక్కడ 4,014 కొత్త కేసులు నమోదయ్యాయి. అలాగే, 59 మంది ప్రాణాలు కోల్పోయారు.