- ఢిల్లీలో చానుకు ఘనస్వాగతం
దర్వాజ-న్యూఢిల్లీ
టోక్యో ఒలింపిక్స్ లో రజత పతకం సాధించి భారత కీర్తిపతాకను రెపరెపలాడించిన మహిళా వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చానుకు విశిష్ట గౌరవం దక్కనుంది. ఆమెను అడిషనల్ ఎస్పీగా నియమించాలని మణిపూర్ ప్రభుత్వం నిర్ణయించింది. దీనిపై తాజాగా రాష్ట్ర ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ మాట్లాడుతూ.. చానును ఏఎస్పీగా నియమిస్తున్నామని తెలిపారు. అలాగే, ఒలింపిక్స్ లో పాల్గొంటున్న జూడో క్రీడాకారిణి లిక్మబమ్ సుశీలా దేవికి పోలీసు కానిస్టేబుల్ నుంచి ఎస్సైగా పదోన్నతి కల్పిస్తున్నామని వెల్లడించారు.
కాగా, ఇదివరకే చానుకు కోటి రూపాయల నజరనా ప్రకటించిన మణిపూర్ సర్కార్.. సుశీలా దేవికి సైతం రూ.25 లక్షల నజరానా అందిస్తామని తెలిపారు. కాగా, చాను ఈవెంట్ పూర్తి కావడంతో ఆమె స్వదేశానికి తిరిగొచ్చిన వేళ… ఢిల్లీ విమానాశ్రయంలో ఆమెకు ఘనస్వాగతం లభించింది.