దర్వాజ-ముంబయి
మహారాష్ట్ర రాజధాని ముంబయిలో శుక్రవారం తెల్లవారు జామున లైంగికదాడికి గురై… ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలు శనివారం మృత్యువుతో పోరాడుతూ ప్రాణాలు కోల్పోయిందని తాజాగా పోలీసులు వెల్లడించారు. దుండగులు అత్యంత దారుణంగా ఆమెపై లైంగికదాడికి పాల్పడ్డారు. పాశవికంగా.. బాధితురాలి మర్మాంగాల్లోకి ఇనుప రాడును చొప్పించి.. హింసించడంతో తీవ్ర రక్తస్రావమై ఆరోగ్యం క్షిణించి ఆమె మరణించిందని వైద్యులు తెలిపారు.
కాగా, సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా ఓ నిందితుడు మోహన్ చౌహన్ అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. న్యాయస్థానం నిందితుడిని ఈ నెల 21వరకు పోలీసు కస్టడీకి అప్పగించింది. ఉత్తరప్రదేశ్కు చెందిన చౌహన్కు ఇద్దరు పిల్లలు సైతం ఉన్నారని పోలీసులు తెలిపారు. ఇదిలావుండగా, బాధిత కుటుంబానికి సత్వర న్యాయం అందేలా చర్యలు తీసుకోవడానికి పోలీసు ఉన్నతాధికారులతో మాట్లాడినట్టు రాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాక్రే పేర్కొన్నారు.
ఈ ఘటనను సుమోటోగా స్వీకరించిన జాతీయ మహిళా కమిషన్ (ఎన్సీడబ్ల్యూ) త్వరలోనే విచారణ ప్రారంభిస్తుందని కమిషన్ చీఫ్ రేఖ శర్మ వెల్లడించారు. ఢిల్లీ నిర్భయ తరహాలో చోటుచేసుకున్న ఈ ఘటనపై సర్వత్రా ప్రజాగ్రహం వ్యక్తమవుతోంది. నిందితుడికి ఉరిశిక్ష విధించాలని డిమాండ్ వినిపిస్తోంది.