ఘోర పడవ ప్రమాదం.. 70 మంది మృతి
నైజీరియాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న పడవ మునిగిన ఘటనలో 70 మంది జల సమాధి అయ్యారు. మరో 100 మందికి పైగా గల్లంతయ్యారు. కెబ్బీ రాష్ట్రంలోని వర పట్టణానికి సమీపంలోని నైజర్ నదిలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ప్రమాద సమయంలో పడవలో 160 నుంచి 200 మంది ప్రయాణికులు ఉన్నట్టు సమాచారం.
ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే అధికారులు రంగంలోకి దిగి రక్షణ చర్యలు చేపట్టారు. 70 మృతదేహాలను వెలికితీశారు. కొందరిని రక్షించగలిగారు. గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అయితే, వారంతా చనిపోయి ఉంటారని అధికారులు భావిస్తున్నారు. మరోవైపు, నది ఉధృతంగా ప్రవహిస్తుండటంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోందని అధికారులు తెలిపారు.
కాగా, ప్రమాదానికి గల ప్రధాన కారణంగ సామర్థ్యానికి మించి ప్రయాణికులను ఎక్కించుకోవడమేనని అధికారులు తెలిపారు. అలాగే, పడవ శిథిలావస్థకు చేరుకోవడం.. మార్గమధ్యలో నీటిలో పలు భారీ వస్తువులను ఢీకొనడంతో పడవ ముక్కలై ఈ ప్రమాదం చోటుచేసుకుందని అధికారులు ప్రాథమికంగా నిర్థారించారు.
Share this content: