1 మే వరకు నైట్కర్ఫ్యూ!
- ఆదేశాలను పాటించకుంటే చర్యలు తప్పవు
- కరోనా కట్టడికి తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
దర్వాజ- హైదరాబాద్: భారత్లో కరోనావైరస్ విలయతాండవం చేస్తోంది. గత ఐదు రోజుల నుంచి నిత్యం రికార్డు స్థాయిలో లక్షల్లో కోవిడ్ కేసులు నమోదవుతున్నాయి. తెలంగాణలో కరోనా కరాళ నృత్యం చేస్తుంది. సోమవారం తెలంగాణ హైకోర్టు రాష్ట్రంలో కరోనా కట్టడిపై అసంతృప్తి తెలుపుతూ.. కోవిడ్-19 నివారణ చర్యలు సరిగా లేవని ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఈ క్రమంలో తెలంగాణ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా నైట్కర్ఫ్యూ విధించింది. నేటి నుంచి మే 1వ తేదీ వరకు నైట్కర్ఫ్యూ కొనసాగుతుందని ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా నైట్కర్ఫ్యూ .. ప్రతి రోజు రాత్రి 9 గంటల నుంచి తెల్లవారుజాము 5 గంటల వరకు ఉంటుందని ఉత్తర్వుల్లో వెల్లడించారు.
ఆఫీసులు, వాణిజ్య సంస్థలు, దుకాణాలు, రెస్టారెంట్లు, హోటళ్లు తదితరాలన్నీ రాత్రి 8 గంటల వరకే మూసివేయాలని పేర్కొన్నారు. రోడ్లపై జన సంచారాన్ని అనుమతించేది లేదననీ, అంతరాష్ట్ర సర్వీసులు యధావిధిగా కొనసాగుతాయని తెలిపింది. బార్లు, క్లబ్బులు, పబ్లు, థియేటర్లపై నిషేధం విధించింది.
మీడియా, టెలి కమ్యూనికేషన్స్, ఇంటర్నెట్, సరుకు రవాణా, ఎల్పీజీ, పెట్రోల్బంకులు, విద్యుత్ సంస్థలు, నీటి సరఫరా, పారిశుద్ధ్యం, గిడ్డంగులు, సెక్యూరిటీ, రాత్రి షిఫ్టుల్లో పని చేసే పరిశ్రమలు, ఆస్పత్రులు, మెడికల్ ల్యాబ్లు, ఫార్మసీ దుకాణాలు, డాక్టర్లు, నర్సులు, గ్రామీణ, పట్టణ స్థానిక సంస్థల సిబ్బంది, గర్బిణీలు, పేషెంట్లు. మినహాయింపు జాబితాలో ఉన్న వారికి ప్రత్యేక పాస్లేమీ అవసరం లేదని ప్రభుత్వం సూచించింది.
మిగతావారు నిబంధనలను ఉల్లంఘిస్తే.. విపత్తు నిర్వహణ చట్టం కింద చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హెచ్చరించింది. అత్యవసర విధులకు హాజరయ్యే ప్రభుత్వ ఉద్యోగులు, మెడికల్ సిబ్బంది, మీడియా ప్రతినిధులు తప్పకుండా ఐడీ కార్డులను వెంట తీసుకుపోవాలని సూచించింది.
ఎయిర్పోర్టులు, రైల్వేస్టేషన్లు, బస్టాండ్లకు వెళ్లే ప్రయాణికుల వద్ద వ్యాలిడ్ టికెట్లు ఉంటే కూడా కర్ఫ్యూ నుంచి మినహాయింపు ఉంటుందని ప్రభుత్వం సూచించింది. అంతర్ రాష్ట్ర సర్వీసులు, రాష్ట్ర సర్వీసులు యథావిధిగా కొనసాగనున్నట్లు పేర్కొంది. ఈ సర్వీసులపై ఎలాంటి ఆంక్షలు ఉండవని సూచించింది.
Share this content: