దర్వాజ-న్యూఢిల్లీ
కరోనా నిర్ధారణ పరీక్షల కోసం క్యూలైన్
కరోనా టీకాల కోసం క్యూలైన్
ఆస్పత్రుల్లో అడ్మిషన్ల కోసం క్యూలైన్
అంబులెన్సుల్లో రోగుల క్యూలైన్
ఆక్సిజన్ కోసం క్యూలైన్
కరోనా చికిత్స మందుల కోసం క్యూలైన్
చివరికి స్మశానాల ముందు అంత్యక్రియలు చేయడానికి క్యూలైన్..
అవును ఇదే నేటి భారతం !

కనీస వైద్యం అందక.. ప్రాణాలు కోల్పోతున్న అభాగ్యులెందరో.. మరీ దారుణమైన విషయమేంటంటే చివరికి ఆస్పత్రులు సైతం చికిత్స అందించలేము మహా ప్రభో.. ఆక్సిజన్ లేదు. టీకాలు లేవు. కరోనా చికిత్స మందులు లేవు. చివరికి పడకలు కూడా లేవు అనే మాటలే నేడు దేశంలో ఎక్కువగా వినిపిస్తున్నాయి. దీంతో కండ్లముందే కుంటుంబ సభ్యులు ప్రాణాలు విడుస్తున్న దయనీయ.. హృదయవిదారక దృశ్యాలతో నిండిపోయింది నేటి భారతం !
దేశంలో నేడు కరోనా సెకండ్ వేవ్ విజృంభణతో ఆరోగ్య సంక్షోభం నెలకొన్నది. నిత్యం రికార్డు స్థాయిలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో 3,79,257 మందికి కరోనా సోకింది. ఇదే సమయంలో వైరస్ తో పోరాడతూ 3,645 మంది మరణించారు. దీంతో దేశంలో మొత్తం పాజిటివ్ కేసులు 1,83,76,524 చేరగా, మరణాలు 2,04,832 కు పెరిగాయి. మరే దేశంలోనూ ఈ స్థాయిలో ఇప్పటివరకు కరోనా విజృంభణ కొనసాగలేదు.

ఇలాంటి దారుణ పరిస్థితులకు కారణం ప్రభుత్వాల నిర్లక్ష్యధోరణే కారణమని సర్వత్రా ఆరోపణలు వినిపిస్తున్నాయి. నేడు భారత్లో కరోనా రోగులు, వారి కుటుంబాలు ఆస్పత్రుల్లో చేరికలు, పడకలు, ఆక్సిజన్ కోసం అర్థిస్తున్నాయి. తమ సొంతవారి ప్రాణాలు కండ్ల ముందే పోతుంటే.. కాపాడండి అంటూ వేడుకుంటున్న ఆహాకారాలు రోజురోజుకూ మిన్నంటుతున్నాయి.

దీనికి ప్రధాన కారణాలు చాలానే ఉన్నాయి. అయితే, ఆస్పత్రుల్లో ఇలాంటి పరిస్థితులు రావడానికి కారణం ముందుచూపుతో కరోనా విజృంభిస్తే తీసుకోవాల్సిన చర్యలను రెడీ చేయకపోవడమే. కరోనా రోగుల సంఖ్య పెరిగితే.. వారికి చికిత్స అందించడానికి ఆస్పత్రులు, అందులో మౌలిక సదుపాయాలు కల్పించాల్సింది. కానీ అది చేయలేదు. చికిత్స అందిస్తున్న ఆస్పత్రుల్లో అత్యవసర పరిస్థితుల్లో రోగి ప్రాణాలు నిలిపే ఆక్సిజన్ సరిపడంత నిల్వలను సమకూర్చాల్సింది. అది జరగడం లేదు. ఫలితంగా ఢిల్లీలో ఆస్పత్రిలో 20 పైగా, యూపీలోని మరో ఆస్పత్రిలో 17 పైగా మరణాలు సంభవించాయి. ఇవే కాకుండా చాలా రాష్ట్రాల్లో ఇలాంటి విషాద ఘటనలు చోటుచేసుకున్నాయి.

అయితే, ఇతర దేశాలలో ఆస్పత్రులు స్వయంగానే ఆక్సిజన్ను తయారు చేసుకునే సౌకర్యాల ఏర్పాట్లు చేసుకుంటాయి. కానీ భారత్లో స్వయంగా ఆస్పత్రులు ఆక్సిజన్ను ఉత్పత్తి చేసుకునే వెసులుబాటును కలిగిలేవు. ఇది కూడా ఆక్సిజన్ కొరత.. రోగుల ప్రాణాలు కోల్పోవడానికి కారణమవుతోంది. ఆక్సిజన్ సరఫరా చేసే పరిశ్రమలు సైతం దేశంలోని అన్ని రాష్ట్రాల్లో లేకపోవడం దేశ వైద్య ఆరోగ్య మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన విషయాన్ని బహిర్గతం చేసింది. వివిధ దేశాలకు టీకాలు, కరోనా చికిత్స మందులు అందిస్తున్న భారత్ లో కోవిడ్-19 టీకాలు, మందుల కొరత ఉండటం దేశంలో ఆరోగ్య వ్యవస్థ ఎలా ఉందో చెప్పకనే చెబుతోంది. ఇదే నేటి భారతం !

