వంట నూనె మంటలు
- 11 ఏండ్ల గరిష్టానికి పెరిగిన ధరలు
- లబోదిబో మంటున్న ప్రజలు
ఒకవైపు కరోనా మహమ్మారి సృష్టించిన ఆర్ధిక, ఆరోగ్య సంక్షోభం కొనసాగుతుండగా.. మరోవైపు ఆహార సంక్షోభం దిశగా అడుగులు పడుతున్నాయి. ఎందుకంటే ఇప్పటికే భారీ స్థాయిలో నిత్యావసరాల ధరలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. మరీ ముఖ్యంగా వంట నూనెలు ఇంటికి చేరకుండానే మంటపుట్టిస్తూ ప్రజల నడ్డి విరుస్తున్నాయి. దీనికి ప్రధాన కారణం వంట నూనెల ధరలు ఆకాశమే హద్దుగా రికార్డు స్థాయిలో పెరగడమే. దశాబ్ద కాలంలో ఎన్నడూ లేనంతగా దేశంలో నేడు వంట నూనెల ధరలు పెరగడం ప్రస్తుతం పరిస్థితికి అద్దం పడుతోంది. ఈ విషయాన్ని పౌర సరఫరాల శాఖల అధికారిక లెక్కలే ధ్రువీకరిస్తున్నాయి.
వేరుశనగ (పల్లీ), సన్ ఫ్లవర్, పామ్ ఆయిల్, సోయా, ఆవ, వనస్పతి ఇలా వంటకు ఉపయోగించే అన్ని రకాల నూనెల ధరలు గతేడాదితో పోలిస్తే రెట్టింపు స్థాయిలో పెరిగాయి. గత 11 ఏండ్లలో వంట నూనెల ధరలు ఈ మే నెలలో గరిష్టంగా నమోదయ్యాయి. ఒకవైపు కరోనా కల్లోలం.. మరోవైపు మండిపోతున్న నిత్యావసరాల ధరలు సామాన్యుల బతుకులను మరింత చిదిమేస్తున్నాయి. గతేడాది ఇదే సమయంలో వంట నూనెల ధరలు నేటి ధరలో పోలుస్తూ… సోషల్ మీడియాలో నెటిజన్లు పెద్ద ఎత్తున పోస్టులు పెడుతున్నారు.
సామాన్య ప్రజలు మార్కెట్లలో వంట నూనేల మంటలపై లబోదిబో మంటున్నారు. ప్రస్తుత పౌర సరఫరా శాఖల లెక్కల ప్రకారం, వేరుశనగ నూనె(పల్లీ) కేజీ రూ.175.50, వనస్పతి 127 రూపాయలు, సోయా 148 రూపాయలు, సన్ఫ్లవర్ 170 రూపాయలకు చేరుకున్నాయి. గతేడాదితో పోలిస్తే వంట నూనెల ధరలు 52 శాతం వరకు పెరిగాయి.
చర్యలకు ఉపక్రమించిన ప్రభుత్వం
ఒకవైపు కరోనా సృష్టించిన ఆర్థిక, ఆరోగ్య సంక్షోభంతో దారుణంగా మారిన ప్రజల పరిస్థితి.. నిత్యావసరాల ధరల పెరుగుదలతో మరింత దిగజారుతోంది. ఈ నేపథ్యంలోనే చర్యలకు ఉపక్రమించిన కేంద్ర ప్రభుత్వం తాజాగా వివిధ భాగస్వామ్య పక్షాలతో చర్చలు జరిపింది. రాష్ట్ర ప్రభుత్వాలతోనూ చర్చలు జరిపి.. వంట నూనెల ధరల తగ్గుదల అంశాలను పరిశీలించామని అధికార వర్గాలు వెల్లడించాయి.
Share this content: