- జర్నలిస్టులు, సమాజిక కార్యకర్తలపై నిఘా ఎందుకు?
- పెగాసస్ బాధిత రాజకీయ నాయకులతో పాటు దేశంలోని ప్రముఖులు ఎవరు?
- దీనిపై ప్రతిపక్షాలు, జర్నలిస్టులు ఏమంటున్నారు?
దర్వాజ-న్యూఢిల్లీ
భారత్ లోనే కాకుండా ప్రపంచంలోని చాలా దేశాల్లో ప్రస్తుతం హాట్ టాపిక్ ’పెగాసస్‘. దాదాపు రెండేండ్ల తర్వాత భారత్ లో మళ్లీ పెగాసస్ అంశం తెరపైకి వచ్చింది. దేశంలోని పలువురు కేంద్ర మంత్రులు, ప్రతిపక్ష నేతలు, జర్నలిస్టుల ఫోన్లు హ్యాకింగ్కు గురయ్యాయనీ, దీని ద్వారా వారిపై నిఘా పెట్టారని తాజాగా పలు మీడియా సంస్థలు సంచలన కథనాలు ప్రచురించాయి. గార్డియన్, వాషింగ్టన్ పోస్టు, లేమాండ్తో వంటి అంతర్జాతీయ మీడియా సంస్థలతో పాటు దేశీయ మీడియా ది వైర్ సహా మొత్తం 17 మీడియా సంస్థలు ఈ కథనాలను ప్రచురించాయి. మన దేశంలో జాతీయ మీడియా పెద్దగా కనిపించని ఈ పెగాసస్ అంశం.. స్థానిక మీడియాలో కవరేజీ అధికంగానే ఉంది.
అసలు ఎంటీ ఈ పెగాసస్ ? దీంతో ఎలా వ్యక్తులపై నిఘా పెడుతున్నారు? ఎలా పుట్టుకొచ్చింది ఇది?
పెగాసస్ ఒక స్పైవేర్. దీనిని ఐఫోన్, ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్లలో చొప్పించవచ్చు. వినియోగదారుడికి తెలియకుండా మెసేజ్లు, ఫొటోలు, ఈ మెయిల్స్ను ఇది ఆపరేటర్కు పంపుతుంది. కాల్స్ను కూడా రికార్డు చేస్తుంది. మైక్రోఫోన్ను కూడా ఆన్ చేసి వ్యక్తుల సంభాషణను మనకు తెలియకుండా పంపిస్తుంటుంది. మొత్తంగా చెప్పాలంటే మనకు తెలియకుండా మన విషయాలన్నింటిని మన ఫోన్ ద్వారా తెలుసుకుంటూ ఉంటారన్నమాట.

మన ఫోన్లలో ఎలా ఇన్స్టాల్ చేస్తారు?
సాధారణంగా నకిలీ వెబ్సైట్ లింక్ల ద్వారా హ్యాకర్లు ఈ స్పైవేర్ను పంపిస్తారు. యూజర్లు తమకు తెలియకుండానే ఈ లింక్ను క్లిక్ చేయడంతో పెగాసస్ ఫోన్లో ఇన్స్టాల్ అవుతుంది. ఇక వాట్సాప్ లాంటి యాప్ల ద్వారా చేసే వాయిస్ కాల్స్లో ఉండే సెక్యూరిటీ బగ్ల ద్వారా కూడా దీన్ని ఫోన్లలో ఇన్స్టాల్ చేస్తుంటారు. ఒక్కోసారి కేవలం మిస్డ్కాల్తోనే దీన్ని ఫోన్లలోకి జొప్పిస్తుంటారు. సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ అయిన తర్వాత కాల్ లాగ్లోకి వెళ్లి మిస్డ్కాల్ను డిలీట్ చేస్తారు. అప్పుడు యూజర్కు మిస్డ్కాల్ వచ్చిన విషయం కూడా తెలియదు. ఇది చాలా స్మార్ట్ స్పైవేర్ చాలా స్మార్ట్ ఎందుకంటే.. 60 రోజులకు పైగా ఈ మాల్వేర్ కమాండ్ కంట్రోల్ సర్వర్తో కమ్యూనికేషన్ చేయలేకపోయినా.. లేదా తప్పుడు డివైజ్లో ఇన్స్టాల్ అయినట్టు తెలిసినా దానంతట అదే నాశనం అవుతుంది.
పెగాసస్ను తయారు చేసింది ఏవరు?
ఇంత స్మార్ట్ అయిన ఈ పెగాసస్ స్పైవేర్ ను ఇజ్రాయెల్కు చెందిన ఎన్ఎస్వో గ్రూప్ అనే సంస్థ తయారు చే సింది. ఈ పెగాసస్ స్పైవేర్ని నిఘా కార్యకలాపాల కోసం ఎన్ఎస్వో పలు ప్రభుత్వాలు, ప్రభుత్వ ఆధీనంలో పనిచేసే సంస్థలకు విక్రయిస్తుంటుంది. ప్రభుత్వాలు ఈ సెగాసస్ స్పైవేర్ ను నేరగాళ్లను, ఉగ్రవాదులను పట్టుకోవడం కోసం ఉపయోగిస్తుంటాయి. ప్రస్తుతం దీనిని ప్రభుత్వాలను ప్రశ్నించేవారిని లక్ష్యంగా చేసుకుని వివిధ దేశాల ప్రభుత్వాలు ఉపయోగించుకుంటున్నాయని ఆరోపణలున్నాయి.
ప్రపంచంలోని చాలా దేశాల్లోని ప్రముఖులు, జర్నలిస్టులు, సమాజిక కార్యకర్తలే టార్గెట్ !

ఈ పెగాసస్ స్పైవేర్ 2019లో భారత్లో కలకలం రేపింది. వాట్సాప్ ద్వారా తమకు తెలియని, అజ్ఞాత సందేశాలు వచ్చాయని, వాటితో తమ ఫోన్లలోకి పెగాసస్ను జొప్పించారని కొందరు జర్నలిస్టులు, సామాజిక హక్కుల కార్యకర్తలు ఆరోపించారు. ఇదే సమయంలో ఫేస్ బుక్ సహా పలు సంస్థలు పెగాసస్ స్పైవేర్తో తమ వినియోగదారుల గోప్యతకు భంగం కలుగుతోందంటూ ఎన్ఎస్వోపై కేసు కూడా నమోదు చేశాయి. దాదాపు రెండు సంవత్సరాల తర్వాత మళ్లీ భారత్ సహా మరో 50 పైగా దేశాల్లో పెగాసస్ హాట్ టాపిక్ గా మారింది. ‘ది పెగాసస్’ పేరుతో ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్, ఫ్రాన్స్కు చెందిన ఫోర్బిడెన్ స్టోరీస్ దర్యాప్తు జరిపి ఈ డేటాబేస్ను రూపొందించినట్టు సమాచారం. దీనిన ప్రపంచవ్యాప్తంగా ఉన్న 17 మీడియా సంస్థలు ప్రచురించాయి. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 50,000 మంది ఫోన్ నంబర్లపై పెగాసస్ సాయంతో ఎన్ఎస్వో నిఘా పెట్టిందని మీడియా నివేదికలు చెబుతున్నాయి. ఇప్పటివరకు 1000 నంబర్లను గుర్తించగా.. ఏజెన్సీ ఫ్రాన్స్ ప్రెస్, సీఎన్ఎన్, ది న్యూయార్క్ టైమ్స్, అల్ జజీరా తదితర వార్తాసంస్థలకు చెందిన 189 మందికి పైగా జర్నలిస్టుల పేర్లు జాబితాలో ఉన్నట్లు సమాచారం. అలాగే, 600మందికి పైగా రాజకీయ నాయకులు, ప్రభుత్వ అధికారులు, 65 మంది వ్యాపార ఎగ్జిక్యూటివ్లు, 85 మంది మానవహక్కుల కార్యకర్తలు ఉన్నారు.
భారత్ లో పెగాసస్ బాధితులు ఎక్కువే..
పెగాసస్’తో లక్ష్యంగా చేసుకున్నవారి జాబితాలో 300 మందికి పైగా భారతీయులు ఉన్నారు. వారందరి ఫోన్ నంబర్లు తాజా డేటాబేస్లో అందుబాటులో ఉన్నాయి. కేంద్ర మంత్రులు, ప్రతిపక్ష నేతలు, న్యాయ నిపుణులు, వ్యాపారవేత్తలు, ప్రభుత్వ అధికారులు, శాస్త్రవేత్తలు, హక్కుల కార్యకర్తల వంటి వారు బాధితుల జాబితాలో ఉన్నారు. 2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు.. 2018-19 సంవత్సరాల మధ్య వీరిని లక్ష్యంగా చేసుకున్నస్టు సదరు మీడియా కథనాలు పేర్కొన్నాయి. ”హిందుస్తాన్ టైమ్స్ ఎడిటర్ శిరీష్ గుప్తా; ద హిందూ, ఇండియన్ ఎక్స్ప్రెస్, ఇండియా టుడే, నెట్వర్క్18ల వ్యవస్థాపకుల పేర్లు జాబితాలో ఉన్నాయి. జర్నలిస్ట్ రోహిణీ సింగ్, ఇండియన్ ఎక్స్ప్రెస్ డిప్యూటీ ఎడిటర్ సుశాంత్ సింగ్ పేర్లు కూడా ఉన్నాయి. అమిత్ షా కుమారుడు జయ్ షా వ్యాపార లావాదేవీలపై రోహిణి వార్తలు రాశారు. మరోవైపు రఫేల్ ఒప్పందంపై సుశాంత్ వరుస కథనాలు ప్రచురించారు”అని ద వైర్ పేర్కొంది. మొత్తంగా 40 మంది జర్నలిస్టులపై నిఘా పెట్టినట్టు వివరించింది.
ప్రస్తుతం గుర్తించిన జాబితాలో వీరి పేర్లు..

కేంద్ర మంత్రలు అశ్వినీ వైష్ణవ్, ప్రహ్లాద్ పటేల్, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్, కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, అశోక్ లావాసా (మాజీ ఎన్నికల కమిషనర్), తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ బెనర్జీ, గగన్దీప్ కాంగ్ (ప్రముఖ శాస్త్రవేత్త, వైరాలజిస్ట్) హరి మీనన్-బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్ ఇండియా హెడ్, జగదీప్ చోఖర్, అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ అధిపతి, అలంకర్ సవాయి-కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ సహాయకుడు, సచిన్ రావు- కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యుడు సహా పలువురు ఉన్నారు. రాహుల్ గాంధీ ఉపయోగించిన కనీసం రెండు ఫోన్ నంబర్లు ఈ జాబితాలో ఉన్నట్టు ఆ కథనాలు పేర్కొన్నాయి.
స్వతంత్ర దర్యాప్తు జరిపించాలంటూ డిమాండ్..
ఫోన్ల హ్యాకింగ్ వ్యవహారంలో కాంగ్రెస్ పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దేశ భద్రతను పణంగా పెట్టి కేంద్ర ప్రభుత్వం దేశ ద్రోహానికి పాల్పడిందంటూ విమర్శించింది. కేంద్ర మంత్రి అమిత్ షాను పదవీ నుంచి వెంటనే తొలగించాలనీ, పెగాసస్ వ్యవహారంలో ప్రధాని మోడీ పాత్రను నిగ్గుతేల్చడానికి విచారణ చేయాలని డిమాండ్ చేసింది. ఇతర ప్రతిపక్ష పార్టీలతో చర్చించి జ్యుడిషియల్ లేదా పార్లమెంటరీ విచారణ డిమాండ్ పై నిర్ణయం తీసుకుంటామని ప్రకటించింది.
ఇటు ఇండియన్ ఉమెన్స్ ప్రెస్ కార్ప్స్ సైతం పెగాసస్ వ్యవహారంపై స్వతంత్ర దర్వాప్తు జరిపించాలని డిమాండ్ చేసింది.