- ఉపాధి మొదలు.. మిషన్ అంత్యోదయ వరకు అన్ని పనుల్లో వాళ్లే..
- ఒత్తిడి భరించలేక ఆత్మహత్యలు చేసుకుంటున్న కార్యదర్శులు
అతను ఒక్కడే.. పనులు మాత్రం ఎన్నో.. అతను ఒక్కడే.. సమాధానం ఇవ్వాల్సింది ఎందరికో.. ఎవరు తప్పుచేసినా బలయ్యేది అతను ఒక్కడే.. బతుకు బండిని నడిపేందుకు ఏమన్నాకానీ తలవంచుకుపోతున్న ఒక కింది స్థాయి ఉద్యోగుల ముచ్చట ఇది. పని భారం భరించలేక.. ఎవరిని నిందించలేక పానం తీసుకుంటున్న పంచాయతీ కార్యదర్శులదీ విషయం.
“ బతకాలని ఉన్నా .. లోకం వీడుతున్నా.. పనిభారం, పాలిటిక్స్ భరించలేకపోతున్నా.. నా చావుకు కారణం నా ఉద్యోగమే.. ఒత్తిడిని తట్టుకోలేకే చనిపోతున్నా.. ఫిబ్రవరి 22 నుంచి 27 వరకు ఈజీఎస్ పనులు చేయించినా.. టీఏ బిల్లులు చేయడు. దానికి తోడు ఏపీవో బండ బూతులు తిడుతుంటడు. ఎంపీడీవో పట్టించుకోడు. సర్పంచ్ , వార్డు సభ్యుల నుంచి సహకారం ఉండదు. వారు పని చేయకున్నా.. అడిగినంత డబ్బులు ఇవ్వాలని రాజకీయ ఒత్తిళ్లు వస్తాయి. అవినీతికి తలదించుకోలేకపోతున్నా.. ఉపాధిలో చేసిన పనులకు బిల్లులు వస్తలేవు. పనిభారం ఎక్కువైతుంది.. అధికారుల నుంచి సహాకారం తక్కువైపోయింది. అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నా.. “ అంటూ సూసైడ్ నోట్ రాసి ఒక పంచాయతీ కార్యదర్శి ఆత్మహత్య చేసుకున్నాడు.
ఈ విషయం ఇప్పుడు రాష్ట్రంలో కలకలం సృష్టిస్తోంది. ఈ ఘటన మెదక్ జిల్లా అందోల్ మండల పరిధిలోని నాదులాపూర్ లో చోటుచేసుకుంది. అక్కడ పంచాయతీ కార్యదర్శిగా పని చేసిన జగన్ అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. దానికిగల కారణాలను సూసైడ్ నోట్ లో రాసాడు. ఆ నోట్ ఇప్పుడు కలవరం లేపుతోంది. ఇది నిజమేనని పంచాయతీ కార్యదర్శులు అంటున్నారు. వారి తిప్పలు ఎవరికీ పట్టడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

పనిభారం తిప్పలు
పని భారానికి నిదర్శణం ఆందోల్ లో జగన్ ఆత్మహత్యే అని పలువురు పంచాయతీ కార్యదర్శులు తన బాధను వెళ్లగక్కుతున్నారు. తమకు సంబంధం లేని పనులను అప్పగిస్తూ తమను ఆగం చేస్తున్నారని తలలను పట్టుకుంటున్నారు. ఎన్నో రోజులుగా రాష్ట్ర ప్రభుత్వం తమకు సంబంధంలేని పనులను అప్పగిస్తున్నారని పంచాయతీ కార్యదర్శులు చెబుతున్నారు. ఆ పనులను చేయకుంటే సోకాజ్ నోటీసులు, సస్పెండ్ అంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నారని చెబుతున్నారు.
మరి కొన్ని గ్రామాల్లో రాజకీయ నాయకుల నుంచి వివక్షకు గురవుతున్నారు. ఇంట్లో పాలేరును అనే మాదిరిగా బండబూతులు తిడుతున్నారని ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం మొన్నటి వరకు ఉపాధి హామీ సిబ్బందికే పరిమితమైన ‘ ఉపాధి ‘ పర్యవేక్షణ.. ఇప్పుడు పంచాయతీ కార్యదర్శులకు అప్పగించింది. పల్లె ప్రగతి మొదలు రాష్ట్ర ప్రభుత్వం ఏ కార్యక్రమం చేపట్టినా.. అవి పంచాయతీ కార్యదర్శులపై మోపుతున్నట్లు చెబుతున్నారు.

పంచాయతీ నిర్వహణలోనే క్షణం తీరిక లేకుండా పని చేస్తున్న కార్యదర్శులపై అదనంగా రోజుకో బాధ్యత అప్పగిస్తుండటంతో తలకు మించిన భారం వాళ్లు మోయాల్సి వస్తోంది. ఉపాధి హామీ పనుల పర్యవేక్షణకు పకడ్బందీ చర్యలు చేపట్టాలని సంకల్పించిన ప్రభుత్వం గత ఏడాదిగా గ్రామ స్థాయిలో ఈ బాధ్యతలను పంచాయతీ కార్యదర్శులకు అప్పగించింది.
దాంతో కూలీలకు అవసరమైనప్పుడు వెంటనే పనులు అప్పగించడం మొదలుకుని.. వాటిని పర్యవేక్షించే బాధ్యతలను వీరే మొస్తున్నారు. ఇప్పటికే అన్ని గ్రామాల్లో నర్సరీల నిర్వహణలో తలమునకలవుతున్న వారికి ఈ పనును అదనంగా అప్పగించారు. అంతే కాకుండా హరితహారంలో నాటిన ఒక్క మొక్క చనిపోయినా.. సస్పెండ్ అయ్యేది కార్యదర్శులు మాత్రమే అని బాధపడుతున్నారు. శానిటేషన్ కొరవడినా తమకే తిప్పలని వాపోతున్నారు.
ఆ పనికి కూడా వాళ్లే..
జిల్లాలో ఉపాధి హామీ పనుల్లో అనుకున్న లక్ష్యాలను చేరుకోని పంచాయతీలను అధికారులు గుర్తించారు . ఆ గ్రామాల్లో గ్రామ పంచాయతీ కార్యదర్శులను భాగస్వాములను చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా పని చేస్తున్న 369 మంది ఎస్ఏలను గతేడాది ప్రభుత్వం తొలగించింది. అన్ని గ్రామాల్లోనూ ఉపాధి హామీ బాధ్యతలను పంచాయతీ కార్యదర్శులే పర్యవేక్షించాల్సి వస్తోంది.
కొరవడిన సహకారం
పంచాయతీ కార్యదర్శులకు ఉపాధిహామీ సిబ్బంది నుంచి సహకారం కొరవడిందనే చేప్పాలి. గ్రామాల్లో చేసిన పనులకు టీఏలు నిత్యం పర్యటిస్తూ ఎప్పటికప్పుడు కొలతలు తీసుకోవాల్సి ఉంటుంది. మస్టరు గ్రామ స్థాయిలో ఉపాధి కూలీలకు ఇవ్వాలి. పే స్లిప్పులను అందజేయాలి. కూలీలను పనులకు వెళ్లే విధంగా చైతన్య పరచాలి. ఈ పనులను ఎంపీడీవోలు పర్యవేక్షిస్తే బాగుంటుంది. నిర్లక్ష్యం వహిస్తున్న టీఏలను మందలించి పనుల్లో భాగస్వాములను చేయాలి. అలా చేస్తే.. పంచాయతీ కార్యదర్శి , డీఏలు సంయుక్తంగా కదులుతారు. దాంతో పనిభారం తగ్గుతుంది. కానీ ఈ పనులన్నీ పంచాయతీ కార్యదర్శులే నిర్వహిస్తున్నారు. దీంతో ఉదయం 7 గంటలకే విధుల్లో చేరాల్సివస్తోంది. రాత్రి దాటిన తరువాతనే ఇంటికి పోవాల్సి స్తోంది.

మరిన్ని బాధ్యతలు
రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీ కార్యదర్శులకు కేవలం ఉపాధి పనుల బాధ్యతలే కాకుండా 10 రకాల ఇతర బాధ్యతలను కూడా అప్పగించింది. ప్రభుత్వం ఏ కార్యక్రమాన్ని ప్రారంభించినా.. వాటిని క్షేత్రస్థాయిలో పంచాయతీ కార్యదర్శులకే అప్పగిస్తున్నారు. పల్లె ప్రగతి నిర్వహణ ఏ విధంగా సాగుతుందో పర్యవేక్షించడంతో పాటూ దానికి సంబంధించి రోజువారిగా ఫొటోలు తీసి యాప్ లో అప్ లోడ్ చేయాలని వారికి ఆధికారులనుంచి ఆదేశాలు ఆదేశాలు జారీ కావడం తెలిసిందే. అంటే ఉదయం 7 గంటల లోపే వాళ్లు విధుల్లో ఉండాలనమాట. ఇంత చేసినా కూడా పల్లెప్రగతిలో నిర్లక్ష్యం వహించారన్న కారణంగా అనేకమంది పంచాయతీ కార్యదర్శులకు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే.
ఇటీవల మిషన్ అంత్యోదయ సర్వే బాధ్యతలు కూడా పంచాయతీ కార్యదర్శులకే అప్పగించారు . విరామం లేకుండా విధులు నిర్వహిస్తున్న కార్యదర్శులకు సెలవులు కూడా లేకపోవడం గమనార్హం . ఇతర ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా తమ కూడా ప్రభుత్వ సెలవులు ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తున్నారు. కేవలం పంచాయతీ నిర్వహణ బాధ్యలకే పరిమితం చేసి, ఇతర అదనపు బాధ్యతలను నుంచి మినాహించాలని వేడుకుంటున్నారు.

స్పెషల్ స్టోరీ: జోగు శ్రీనివాస్, రిపోర్టర్
రంగారెడ్డి
దర్వాజ.కామ్ లో రిపోర్టర్ గా జాయిన్ కావాలనుకుంటున్నారా ? అయితే వెంటనే మీ బయోడేటా ఫాంను మాకు మెయిల్ చేయండి. మా మెయిల్ ఐడీ: darvaaja@gmail.com లేకపోతే మాకు కాల్ చేయండి. మా నెంబర్:7780448771
మీ అభిప్రాయాలను ప్రపంచంతో పంచుకోవాలనుకుంటున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం.. నలుగురిని ఆలోచింపజేసే ఏ ఆర్టికల్ ను అయినా మా వెబ్సైట్ లో పబ్లిష్ చేసేందుకు మేము సిద్ధంగా ఉన్నాం. మీరు చేయాల్సిందల్లా మీ ఆర్టికల్స్ ను darvaaja@gmail.com కు మీ ఫొటో వివరాలతో పాటుగా మెయిల్ చేయడమే..
ఎంపీ అరవింద్ కు కేంద్రంతో కొట్లాడే దమ్ముందా?
ఏందే అన్నా.. ఎట్లున్నా కష్టమేనా ?