హర హర మహాదేవ.. శంభో శివ శంకర అంటూ.. భక్తితో కాసిన్ని నీళ్ళు శివలింగంపై చల్లితే చాలు.. కొలిచిన వారికి కొంగు బంగారం చేస్తాడు శివయ్య.. అంతటి దయామయుడు. అలాంటి పరమ శివుడు మయాలు ఎన్నో మహిమలు మరెన్నో..
ఏటా మాఘ బహుళ చతుర్దశి నాడు చంద్రుడు శివుని జన్మ నక్షత్రమైన ఆరుద్ర యుక్తుడైనప్పుడు మహా శివరాత్రి వస్తుంది. పరమేశ్వరుడు ఈ రోజే లింగాకారంగా ఆవిర్భవించాడని శివ పురాణంలో పేర్కొన్నారు. భోళాశంకరుడిగా, ఆదిదేవుడిగా, సర్వజ్ఞుడిగా, పరమశివునిగా కీర్తించబడే పరమాత్మయే ఈశ్వరుడికి ఈ రోజంటే… అత్యంత ప్రీతి. ఈ రోజున ఉపవాసం, శివార్చన, జాగరణ చేయడం వల్ల ఎంతో పుణ్యం దక్కుతుందని నమ్మకం.
ఉపవాసం అత్యంత శ్రేష్ఠమైంది. భక్తులు తమ ఇష్టానుసారంగా ఉపవాసం చేస్తుంటారు. కొందరు రోజంతా ఉపవాసం ఉండి మరుసటి రోజు ఉదయం భోజనం చేస్తుంటారు. మరికొందరు శివరాత్రి రోజు పగలంతా ఏం తినకుండా ఉండి రాత్రి నక్షత్ర దర్శనం చేసుకుంటారు. ఆ తర్వాత భోజనం చేయడం ఒక ఆచారం. దీన్నే నక్తం అంటారు. మరికొందరు పగటి పూట ఏదో ఒకటి తిని.. రాత్రి ఉపవాసం ఉంటారు. దీన్ని ఏక భుక్తం అంటారు.
అసలు ఉపవాసం అంటే.. దేవుడికి అతి సమీపంలో వసించడమే ఉపవాసం. మనం ఇంద్రియాలతో అనుభవిస్తున్నవన్నీ ఆహారాలే. వాటన్నింటికీ దూరంగా ఉండటమే నిజమైన నియంత్రణం. అదే నిజమైన ఉపవాసం. భౌతికాభిరుచులన్నింటినీ పక్కకు పెట్టి పూర్తిగా శివ సంబంధమైన కార్యక్రమాల్లోనే త్రికరణ శుద్ధిగా తాదాత్మ్యం చెందాలి. భోగానందాన్ని విస్మరించి, యోగానందావస్థలోకి ప్రవేశిస్తూ కోటి వెలుగుల ఆ శివజ్యోతి ప్రకాశాన్ని అంతరంగంలో ఆవిష్కరించుకుని సచ్చిదానందమైన ఆధ్యాత్మిక ప్రస్థానం చేయడమే మహాశివరాత్రి ఆంతర్యం. దేవుడైనా సరై.. కడుపు చంపుకుని పూజ చేయమని చెప్పలేదు.

అలాగే.. శివయ్య అభిషేకప్రియుడు. శివుడి పార్థివ లింగాన్ని మహన్యాసపూర్వకంగా ఏకాదశ రుద్రాభిషేకంతో, నమక చమకాలతో, పురుష సూక్తంతో పూజిస్తారు. అయితే పూజా విధానం, మంత్రాలు తెలియక పోయినప్పటికీ ‘ఓం నమశ్శివాయ’ అనే పంచాక్షరీ మంత్రం జపిస్తే.. చాలు శివానుగ్రహం లభిస్తుందని వేద పండితులు చెప్తున్నారు.
పరమ శివుడిని ఆరాధించడంలో జాగరణ అనేది చాలా ముఖ్యమైనది. అసలు శివరాత్రి మహత్మ్యం అంతా రాత్రి వేళల్లోనే ఉంటుంది. అందుకే భక్తులు రాత్రంతా జాగరణ చేస్తుంటారు. భజనలు, పురాణ కాలక్షేపం లేదా శివనామస్మరణలతో రాత్రంతా గడుపుతారు. అర్ధరాత్రి లింగోద్భవ కాలంలో అభిషేకాలు, అర్చనలు చేసి మహాశివుడి సేవలో తరిస్తారు. ఇలా.. ఉపవాసం, జాగరణ చేయటం వల్ల సకల సంపదలు చేకూరుతాయని వారు సూచిస్తున్నారు.
మహాశివరాత్రి ఎలా వచ్చింది?
ప్రతి పండగ వెనుక ఏదోక రహస్యం ఉన్నట్టుగా మహాశివరాత్రి వెనుక కూడా చాలా కథలున్నాయి.. అందులో ఒకటి ఈ కథ… ఈ కథ శివపురాణం నుంచి తీసుకోబడింది. ఒకప్పుడు ప్రళయ కాలం సంప్రాప్త కాగా బ్రహ్మదేవుడు, విష్ణుమూర్తికి అధిపత్యపోరు వచ్చిందట. నేను గొప్ప అంటే నేను గొప్ప అని బ్రహ్మ, విష్ణులు ఇద్దరూ వాదించుకున్నారు. వారద్దరి మధ్య గొడవను తీర్చేందుకు పరమేశ్వరుడు వచ్చి.. వారిద్దరికి మధ్య జ్యోతిర్లింగ రూపంలో ఆవిర్భవించాడు. తన ఆద్యంతాలు ఎవరు కనుక్కొని వస్తారో వాళ్లే గొప్ప అని శివయ్య చెబుతాడు.

దీంతో జ్యోతిర్లింగం యొక్క ఆద్యంతాలు పూనుకున్నారు. బ్రహ్మ.. జ్యోతిర్లింగం మొదలు కనిపెట్టడానికి , విష్ణువు చివర కనిపెట్టడానికి బయలుదేరతారు. కానీ ఎంతదూరం వెళ్లిన వారికి ఆద్యంతాలు కనిపించవు. అంతం కనుక్కోలేక విష్ణువు వెనుదిరిగి వస్తాడు. కానీ బ్రహ్మ మాత్రం తాను మొదలు కనుక్కున్నానని శివుడికి అబద్ధం చెప్తాడు. దారి మధ్యలో కనిపించిన కామధేనువు, మొగలిపువ్వును ఇందుకు సాక్ష్యంగా చూపిస్తాడు. ఆ సమాధానంతో ఆగ్రహించిన శివుడు.. బ్రహ్మ నాలుగో ముఖాన్ని ఖండిస్తాడు. బ్రహ్మ అబద్ధం చెప్పడానికి సహాయపడ్డ మొగలిపువ్వు పూజకు పనికి రాదని శపిస్తాడు. కామధేనువు ముఖంతో అబద్ధం చెప్పినా.. తోకతో నిజం చెప్పినందు వల్ల గోవు వెనుక భాగం పూజనీయం అవుతుందని వరమిస్తాడు శివుడు. ఇక తన ఓటమిని ఒప్పుకున్న విష్ణువుకు తనతో పాటు సమానమైన పూజలు అందుతాయని వరమిస్తాడు. ఆనాటి అర్ధరాత్రిని లింగోద్భవకాలంగా భావించి, మహాశివరాత్రి పర్వదినాన్ని జరుపుకోవడం ఆనవాయితీగా మారింది.
ఈ రోజే.. శివపార్వతుల కళ్యాణం కూడా జరిగిందని విశ్వసిస్తారు. అంటే సతీదేవి అగ్నిప్రవేశం తర్వాత హిమవంతుని కుమార్తె పార్వతిగా జన్మించింది. ఆ తర్వాత శివుని కోసం ఘోర తపస్సు చేసిన పార్వతి.. ఇదే రోజు మహాశివుడిని భర్తగా పొందింది.

ఈ భూప్రపంచంపై .. ఎవరిలోనైతే సకల జీవులకు మేలు చేయాలనే కోరిక ఉంటుందో, పేదలను, దీనులను, నిస్సహాయులను ప్రేమాభిమానాలతో ఆరాధిస్తారో .. సమస్త జగత్తును దహించివేసేందుకు సిద్ధమైన హాలాహలాన్ని తన గొంతుకలో దాచుకున్న నీలకంఠుడు. సహధర్మచారిణికి తన శరీరంలో అర్ధభాగమిచ్చిన అర్ధనారీశ్వరుడు. తనను యముని బారినుంచి రక్షించమని కోరిన భక్త మార్కండేయుని చిరంజీవిగా జీవించమని వరాన్ని ప్రసాదించిన భక్తజన బాంధవుడు ఈశ్వరుడి అనుగ్రహం ఎల్లవేళలా ఉంటుంది. ఆ రుద్రుడు మనందరినీ క్షణక్షణమూ కాపాడుగాక.

ద్వాదశ జ్యోతిర్లింగాలు.. వాటి విశిష్టత!
ఓటుకు నోటు తప్పక తీసుకోవాల్సిందే..!