- స్వాతంత్య్ర సమరయోధులకు వ్యతిరేకంగా బ్రిటిష్ పాలకులు తెచ్చిన చట్టం
- రాజద్రోహ చట్టాన్ని కొనసాగించడం దురదృష్టకరం
- పిచ్చోడి చేతిలో రాయిలా సెక్షన్ 124-ఏ
- దీన్ని తొలగించే విషయం ఆలోచించాలంటూ కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులు
దర్వాజ-న్యూఢిల్లీ
రాజద్రోహ చట్టం.. ఇది ఒక వలస చట్టమనీ, 75 ఏండ్ల స్వాత్రంత్యం అనంతరం కూడా ఈ చట్టాన్ని కొనసాగించడం అవసరమా? అంటూ భారత సర్వోన్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. రాజద్రోహం చట్టానికి ఉన్న రాజ్యాంగ చెల్లుబాటును పరిశీలిస్తామనీ.. దీనిపై సమాధానమివ్వాలంటూ కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది.
రాజద్రోహం కేసులు పెట్టడానికి వీలు కలిగిస్తున్న భారతీయ శిక్షాస్మృతి (ఐపీసీ)లోని సెక్షన్ 124-ఏ చట్టాన్ని సవాల్ చేస్తూ విశ్రాంత సైనికాధికారి మేజర్ జనరల్ (రిటైర్డ్) ఎన్జీ. వాంబాత్కరే దాఖలు చేసిన పిటిషన్పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ. రమణ, జస్టిస్ ఏఎస్ బోపన్న, జస్టిస్ రిషికేష్ రాయ్ లతో కూడిన ధర్మాసనం గురువారం విచారణ జరిపింది. ఈ నేపథ్యంలోనే సుప్రీం త్రిసభ్య ధర్మాసనం రాజద్రోహ చట్టం దుర్వినియోగంపై ఆందోళన వ్యక్తం చేసింది.
ఈ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ. రమణ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘రాజద్రోహ చట్టం బ్రిటన్ నుంచి తెచ్చుకున్న వలస చట్టం. స్వాతంత్రోద్యమాన్ని అణచివేయడానికి ఉద్దేశించినది. 1870లో స్వాతంత్య్ర సమరయోధులకు వ్యతిరేకంగా బ్రిటీష్ వారు ఈ చట్టం తీసుకొచ్చారు. భారతీయుల అణచివేతకు తెల్లదొరలు దీన్ని ఉపయోగించారు. గాంధీ, తిలక్ వంటివారిని ఈ చట్టంతోనే అణచివేయాలని చూశారు. ఇప్పుడు మనకు స్వాత్రంత్యం వచ్చి 75 సంవత్సరాలు అవుతోంది. ఇంకా ఈ రాజద్రోహ చట్టం అవసరమా? అంటూ సీజేఐ ఎన్వీ రమణ కేంద్రాన్ని ప్రశ్నించారు.
75 ఏండ్ల తర్వాత కూడా ఈ చట్ట కొనసాగింపు దురదృష్టకరం
స్వాతంత్య్రం సిద్ధించిన 75 సంవత్సరాల తర్వాత కూడా ఇలాంటి చట్టాలు కొనసాగించడం దురదృష్టకరమని సీజేఐ అన్నారు. పాత కాలపు.. పనికిమాలిన అనేక చట్టాలను తొలగించిన ప్రభుత్వం.. ఈ రాజద్రోహ చట్టం జోలికి ఎందుకు వెళ్ళలేదు? అని ప్రశ్నించారు. పిటిషనర్ దేశ రక్షణ కోసం తన జీవితమంతా త్యాగం చేశాడనీ, ఇది ప్రేరేపిత వ్యాజ్యంగా అనలేమని సీజేఐ పేర్కొన్నారు.
పిచ్చోడి చేతిలో రాయిలా…
‘రాజద్రోహం కింద పెడుతున్న కేసులెన్ని? అందులో నిలబడుతున్నవి ఎన్ని? సెక్షన్ దుర్వినియోగం గురించి ఎందుకు ఆలోచించట్లేదు? ఈ చట్టం దుర్వినియోగం అవుతున్న సందర్భాలే ఎక్కువ. ఈ చట్టంతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. పేకాట ఆడేవారిపైనా దేశద్రోహం కేసులు పెడుతున్నారు. రాజకీయ ప్రత్యర్థుల అణచివేత కోసం దీన్ని తప్పుగా వినియోగిస్తున్నారు. ఫ్యాక్షనిస్టులు ప్రత్యర్థులపై దేశద్రోహం మోపేలా వ్యవహరిస్తున్నారు. బెయిల్ రాకుండా కక్ష సాధింపు, అధికార దాహంతో బెదిరింపు చర్యలకు పాల్పడుతున్నారు. వ్యవస్థలు, వ్యక్తులను బెదిరించే స్థాయికి దిగజారుతున్నారు. రాజద్రోహం సెక్షన్ 124-ఏ పిచ్చోడి చేతిలో రాయిలా ఉంది. కొయ్యను మలిచేందుకు రంపం ఇస్తే అడవిని నాశనం చేసినట్టుంది’ అని జస్టిస్ ఎన్వి రమణ వ్యాఖ్యానించారు.
ఈ చట్టం కేసులన్నీ ఒకేసారి విచారిస్తాం..
రాజద్రోహం సెక్షన్ 124-ఏ తొలగింపునకు ఆలోచించాలని ధర్మాసనం ఈ సందర్భంగా కేంద్రానికి సూచించింది. ఈ చట్టం రద్దుపై వైఖరిని తెలపాలంటూ కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. ఈ సెక్షన్ రాజ్యాంగ చెల్లుబాటును సవాల్ చేస్తూ పలు పిటిషన్లు దాఖలయ్యాయని, వీటన్నింటినీ ఒకేసారి విచారిస్తామని వెల్లడిరచింది. కాగా, రాజద్రోహ చట్టంపై ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా పిటిషన్తో పాటు మొత్తం 32 పిటిషన్లు దాఖలైనట్టు సమాచారం.