- ‘కారు’ గెలిచినా ఓడినట్లే లెక్కకడుతున్న వైనం
- కేసీఆర్ వ్యూహానికి కంగుతిన్న ప్రతిపక్షాలు
- తోపుగా మారిన తీన్మార్ మల్లన్న
ఎమ్మెల్సీ ఎలక్షన్లలో టీఆర్ ఎస్ ను ఎలాగైనా గెలిపించాలని కంకణం కట్టుకున్న సీఎం కేసీఆర్ వ్యూహం ఎట్టకేలకు నెరవేరింది. చివరి క్షణంలో రంగారెడ్డి స్థానానికి భరిలోకి విసిరిన వాణీ దేవి హస్త్రం టీఆర్ ఎస్ కు భలే కలిసొచ్చింది. పల్లా రాజేశ్వర్ రెడ్డికి ఎవరూ ఊహించని విధంగా తీన్మార్ మల్లన్న చుక్కలు చూపించినా.. ఎలాగో అలా లాస్ట్ కు పల్లా గట్టెక్కాడనే చెప్పాలి. వామపక్షాల సపోర్ట్ తో రంగారెడ్డి స్థానంలో స్వతంత్ర అభ్యర్థిగా నిలబడిన ప్రొఫెసర్ నాగేశ్వర్ రణరంగంలో నిలవలేకపోయాడు. నల్లగొండ స్థానంలో పోటీ చేసిన (టీజేఎస్) రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాంకు చేదు అనుభవం తప్పలేదు.

ఈ విజయం టీఆర్ ఎస్ దేనా?
రెండు ఎమ్మెల్సీ స్థానాల్లోనూ టీఆర్ ఎస్ విజయం సాధించినా కూడా.. అది ‘కారు’ విజయం కాదని అటు ప్రతిపక్షాలు, ఇటు పలువురు విశ్లేషకులు అంటున్నారు. దానికి కారణం మొదటి ప్రాధాన్యత ఓట్లతో టీఆర్ ఎస్ అభ్యర్థులు గెలవకపోవడమేనని చెబుతున్నారు. అలాగే రంగారెడ్డి స్థానంలో మాజీ ప్రధాని పీవీ నరసింహ రావు కూతురిని భరిలోకి దింపడం టీఆర్ ఎస్ కు కలిసొచ్చిందని చెబుతున్నారు. ఇక నల్గొండ స్థానంలో భారిగా డబ్బులు పంచారని అటు స్వతంత్ర అభ్యర్థిగా నిలిచిన తీన్మార్ మల్లన్న, ఇటు ప్రతిపక్ష పార్టీలు ధ్వజమెత్తుతున్నాయి. ఆ పంపకాల వలనే చివరి నిమిషంలో పల్లా గెలుపొందాడని అంటున్నారు.
ప్రొఫెసర్లకు అసలేమైంది?
రంగారెడ్డి స్థానంలో స్వతంత్ర అభ్యర్థిగా నిలబడిన ప్రొఫెసర్ నాగేశ్వర్ కు యువతలో మంచి పేరు ఉంది. అలాగే వామపక్షాలు కూడా ఆయనకు అండగా నిలిచాయి. కానీ ఆయన ఎన్నికల యుద్ధంలో నిలవలేకపోయారు. ఆయన్ని ఉద్యోగులు పెద్దగా నమ్మలేదని పలువురు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. దానికి కారణం కూడా లేకపోలేదని చెబుతున్నారు. ముందుగా ప్రొఫెసర్ నాగేశ్వర్ టీఆర్ ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా బరిలో దిగబోతున్నారనే ప్రచారం జరిగింది.

ఒక స్టేజ్ లో టీఆర్ఎస్.. రంగారెడ్డి స్థానంలో ఎవరిని నిలబెట్టడం లేదని, ప్రొఫెసర్ నాగేశ్వర్ కే టీఆర్ఎస్ మద్దతు ఇస్తున్నట్లు ప్రచారం జరిగింది. దీన్ని హస్త్రంగా బీజేపీ వాడుకున్నట్లు తెలుస్తోంది. నిధులు, నియామకాలు బీజేపీతోనే వస్తాయని చెబుతూ.. ప్రొఫెసర్ నాగేశ్వర్ టీఆర్ ఎస్ హస్త్రంగా ఉన్నారని.. ప్రజలకు చెప్పే ప్రయత్నాన్ని బీజేపీ గట్టిగానే చేసిందని చెప్పాలి. దాంతో నాగేశ్వర్ కు పడే ఓట్లను బీజేపీ పట్టుకుపోయిందని పలువురు విశ్లేషకులు చెబుతున్నారు. అలాగే వాణీ దేవి సెంటిమెంట్ కూడా ఆయనకు ఎఫెక్ట్ అయ్యిందని చెప్పాలి. ఈ కారణాల వలనే ప్రొఫెసర్ నాగేశ్వర్ ఈ ఎన్నికల్లో చతికిల పడ్డారని పలువురు అంటున్నారు.
ఇక నల్లగొండ స్థానంలో బరిలోకి దిగిన ప్రొఫెసర్ కోదండరాంకు ఆశించిన స్థాయిలో ఓట్లు పడలేదు. ఉద్యమంలో పోరాడిన వ్యక్తిగా పేరు ఉన్నా.. ఆయన రాజకీయంగా తీసుకునే నిర్ణయాలతో ప్రజలు విసుగెత్తారని పలువురు చెబుతున్నారు. అందుకే నిన్నకాక మొన్న వచ్చిన తీన్మార్ మల్లన్ననే ప్రజలు ఎక్కువగా నమ్మారని చెబుతున్నారు.
తోపుగా నిలిచిన తీన్మార్ మల్లన్న

“తీన్మార్ మల్లన్న అంటే ఏదో జర్నలిస్ట్ గా అధికార పార్టీని విమర్శిస్తూ.. కాలం వెళ్లదీస్తుంటాడు. అతన్ని ఎవరు నమ్ముతారు ?” అని అధికార పార్టీ భావించి ఉండొచ్చు. అందుకే అతన్ని అధికార పార్టీ పెద్దగా పట్టించుకోలేదు. కానీ నల్లగొండ స్థానంలో బరిలోకి దిగిన తీన్మార్ మల్లన్న ఆ స్థానంలో టీఆర్ ఎస్ నుంచి పోటీకి దిగిన పల్లా రాజేశ్వర్ రెడ్డికి చుక్కలు చూపించాడని చెప్పాలి. ఒకనొక టైంలో తీన్మార్ మల్లనే విజయం సాధిస్తారని అంతా అనుకున్నారు. కానీ చివరకు ఎలాగో అలా కొంత మెజర్టీతో పల్లా గెలుపొందాడు. కానీ ఈ విజయం తీన్మార్ మల్లన్నదే అని పలువురు అభిప్రాయ పడుతున్నారు. ఏదేమైనప్పటికీ మల్లన్న ఓడినా తన తీన్మార్ తో ఓ ఊపు ఊపాడనే చెప్పాలి.
బీజేపీ దూకుడుకు బ్రేకులు !

రోజురోజుకు తెలంగాణలో బీజేపీ పుంజుకుంటుందనే చెప్పాలి. దుబ్బాక ఉప ఎన్నికల నుంచి బీజేపీ ఒక ఊపు ఊపుతోంది. ఎప్పటికప్పుడు యువతకు దగ్గరయ్యే ప్రయత్నాలు చేస్తునే ఉందని చెప్పాలి. అందులో తెలంగాణ బీజేపీ లీడర్లు విజయం సాధిస్తున్నారనే అనుకోవొచ్చు. ఎన్నో యేళ్ల నుంచి దేశంలో పలు చోట్ల బీజేపీ స్థిరంగా ఉన్నా.. ఇప్పుడు జరుగుతున్న ఎన్నికల్లో ఆ ప్రాంతాల్లో చతికిల పడుతోంది. కానీ తెలంగాణలో సరైన క్యాడరే లేకున్నా కూడా బీజేపీ పుంజుకోవడంపై ఆ పార్టీ లీడర్లు మస్తు ఖుషీగా ఉన్నారు. రానున్న ఎన్నికల్లో తమదే విజయం అనే ధీమాతో ముందుకు సాగుతూ వస్తున్నారు. అయితే, ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు కమళ శ్రేణులను తీవ్రవంగా కృంగదీశాయని చెప్పాలి. ఎందుకంటే గట్టి పోటీ ఇచ్చినప్పటికీ హైదరాబాద్ ఎమ్మెల్సీ సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకోలేకపోయింది. అలాగే, నల్లగొండ స్థానం నుంచి సైతం అనుకూల ఫలితాలను రాబట్టలేకపోయింది. తాజా ఈ పరిస్థితులు కమలానికి కళ్లేం వేసే దిశగా సాగే పరిస్థితులు లేకపోలేదని రాజకీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
కేసీఆర్ వ్యూహం అదుర్స్
కేసీఆర్ వ్యూహం గురించి దర్వాజ.కామ్ ముందే చెప్పింది. “రాజా.. ఏంటీ కయ్యం” అనే ఆర్టికల్ లో కేసీఆర్ వ్యూహం గురించి, ఆయనకు ఎదురయ్యే సవాళ్ల గురించి చర్చించాం. అనుకున్నట్లే ఆ సవాళ్లను ఎదుర్కొవడానికి ఆయన ఓ మంచి వ్యూహం రచించాడు. దాని అమలును ఆయనే స్వయంగా పర్యవేక్షిస్తూ ఎప్పటికప్పుడు మంత్రులను, ఇన్చార్జిలను, ఎమ్మెల్యేలను, ఇతర మంత్రులను అప్రమత్తం చేస్తూ వచ్చారు.

అలాగే ఉద్యోగులు, కుల సంఘాలు, కాలనీ సంఘాల పేరుతో ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించి వారికి దగ్గరయ్యే ప్రయత్నాన్ని టీఆర్ ఎస్ లీడర్లు చేశారు. అదే కాకుండా క్షేత్రస్థాయిలో ప్రతీ 50 మంది ఓటర్లకు ఒక ఇన్చార్జిని నియమించి వారు ఓటరును దగ్గరయ్యేలా సమన్వయం చేశారు. అలాగే 29 శాతం ఫిట్మెంట్ ఇచ్చేందుకు సుముఖంగా ఉన్నట్లు ఓట్లు జరిగే మూడు రోజుల ముందు ఉద్యోగులకు, సీఎం తీపి కబురు చెప్పారు. అది కూడా టీఆర్ ఎస్ కు కలసి వచ్చిందని చెప్పాలి. దాంతోనే రంగారెడ్డి స్థానంలో 2007, 2015లో సాధించలేని విజయాన్ని ఇప్పుడు సాధించారు.
సాగర్ లో ఎన్నికల రణరంగం ఎలా ఉండబోతుంది?

నాగర్జున సాగర్ ఉప ఎన్నికలు మాములుగా ఉండేలా లేవు. అధికార పార్టీ ఆ స్థానాన్ని కూడా కైవసం చేసుకునేందుకు సిద్ధం అవుతోంది. ఆ స్థానాన్ని సాధించడం కూడా కష్టంతో కూడిన పని అని ఇప్పటికే టీఆర్ ఎస్ పెద్దసారు కేసీఆర్ కు అర్థం అయ్యి ఉంటుంది. అయితే ఇప్పుడు ఏం వ్యూహం రచిస్తారే దానిమీదే అందరి దృష్టి పడింది. ఇక తెలంగాణలో మంచి ఊపు మీద ఉన్న బీజేపీ సారగ్ లో విజయం సాధించాలనే పట్టుతో ఉన్నట్లు తెలుస్తోంది. ఇక రోజురోజుకు చతికిల పడుతున్న కాంగ్రెస్ తన ఉనికిని చాటడానికి సాగర్ ను ఛాలెంజింగ్ గా తీసుకోనున్నట్లు తెలుస్తోంది. దీన్ని పట్టి చూస్తే.. సాగర్ ఉప ఎన్నికలు రణరంగంగా మారడం కాయమని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.