- టీఆర్ఎస్ విజయభావుట ఎగురవేసేనా?
- నువ్వా నేనా అంటూ ప్రచారం సాగిస్తున్న అభ్యర్థులు
- టీఆర్ ఎస్ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపుతున్న కేసీఆర్
దర్వాజ-హైదరాబాద్
తెలంగాణ పట్టాభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు రాష్ట్రంలో రాజకీయ కాకా పుట్టిస్తున్నాయి. నువ్వా నేనా అంటూ బరిలో నిలిచిన అభ్యర్థులు ప్రచార పోరులో దూసుకుపోతున్నారు. అయితే, ఈ ఎమ్మెల్సీ ఎన్నికలను అధికార టీఆర్ఎస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుందని తెలుస్తోంది. ఇప్పటివరకు హైదరాబాద్-రంగారెడ్డి-మహాబుబ్ నగర్ ఎమ్మెల్సీ పట్టాభద్రుల స్థానాన్ని అధికార పార్టీ కైవసం చేసుకోలేదు.
ఈ సారి ఎలాగైన తన ఈ స్థానాన్ని కైవసం చేసుకోవాలనే ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి కేసీఆర్ మాజీ ప్రధాని పీవీ. నరసింహారావు కుమార్తె సురభి వాణిని నిలబెట్టి టీఆర్ఎస్ శ్రేణుల్లోధైర్యాన్ని, ఉత్సాహాన్ని నింపే ప్రయత్నం చేశారని తెలుస్తోంది. ఎందుకంటే ఉత్తర తెలంగాణలోని దుబ్బకా అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో అధికార టీఆర్ ఎస్ పేలవమైన ప్రదర్శన కనబర్చింది. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ శ్రేణులు కొంత నిరసత్వంలో నిండిపోయాయనేది వాస్తవం.
ఇక ఇప్పుడిప్పుడే పుంజుకుంటున్న బీజేపీకి గట్టి కౌంటర్ ఇవ్వడం ద్వారా పార్టీ కేడర్ను మళ్లీ ఉత్తేజపరిచేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని తెలుస్తోంది. ఇక సురభి వాణిని ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో నిలపడం ద్వారా మాజీ ప్రధాని పీవీ.నరసింహరావు రాజకీయ వారసత్వాన్ని ప్రతిబింబించే విధంగా చేయడంతో తెలంగాణ నాయకులుగా తనను మరింత బలోపేతం చేస్తుందని కేసీఆర్ భావిస్తున్నట్టుగా తెలుస్తోంది.
చాలా కాలం నుంచి టీఆర్ ఎస్లో మహిళలకు తగిన గుర్తింపు లభించదనే వార్త వినిపిస్తూ ఉంటుంది. అయితే, ఆ ఆరోపణలు తిప్పికొట్టేందుకు సురభి వాణి అభ్యర్థిత్వం కలిసివచ్చే అవకాశం ఉంది. ఇక ఆమె విద్యారంగానికి చెందిన వ్యక్తి కావడం, శ్రీ వెంకటేశ్వర గ్రూప్ ఆఫ్ ఇనిస్టిట్యూషన్స్ వ్యవస్థాపకులు కావడంతో ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీకి సరైన అభ్యర్థిగా భావించినట్టున్నారు. మరో వైపు దేశంలో ఆర్థిక సంస్కరణల పితామహుడిగా పేరొందిన పీవీ కుమార్తె సురభి సాహిత్యవేత్త కూడా. ఆమె రాజకీయ ప్రారంభానికి ఇది పునాదులు వేస్తుందనే చెప్పాలి.
దాదాపు ఐదు లక్షలకు పైగా ఓటర్లు ఉండగా, వారిలో బ్రాహ్మణ ఓటర్ల సంఖ్య, ముఖ్యంగా మహిళల సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుందని అంచనా. ఈ ఓట్లు అధికార పార్టీ ఖాతలో చేరే అవకాశముంది. కానీ గతంలో ఎప్పుడు హైదరాబాద్ స్థానాన్ని గెలుచుకోని అధికార పార్టీకి గెలుపు దక్కడం మాత్రం అంత సులువుగా దక్కే అవకాశం లేదని రాజకీయ నిపుణులు పేర్కొంటున్నారు.
ఎందుకంటే ప్రస్తుతం ఇదే స్థానం నుంచి కొనసాగుతున్న బీజేపీ అభ్యర్థి ఎన్ రామచంద్రరావు మళ్లీ బరిలో నిలిచారు. ఇక గతంలో రెండు సార్లు ఇదే స్థానం నుంచి కౌన్సిల్ ప్రాతినిధ్యం వహించిన ప్రొఫెసర్ నాగేశ్వర్ సైతం పోటీలో నిలిచారు. ఇప్పటికే వీరిద్దరూ అధికార టీఆర్ఎస్కు వ్యతిరేకంగా ముమ్మరంగా ప్రచారం సాగిస్తున్నారు.
ఈ విధమైన అనుకూల.. ప్రతికూలతల మధ్య కేసీఆర్ రాజకీయంలో అధికార పార్టీ విజయబావుట ఎగురవేస్తుందో లేదో చూడాలి. దీనికి తోడు రాబోయే వరంగల్ , ఖమ్మం మున్సిపల్ ఎన్నికలతో పాటు నాగార్జునా సాగర్ అసెంబ్లీ ఉప ఎన్నికపై ప్రస్తుత పట్టాభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రభావం చూపే అవకాశం చాలా ఉంది. ఏదేమైనప్పటికీ.. ఈ గెలుపు రానున్న రాజకీయ గాలిని ఎటువైపు మళ్లిస్తుందో చూడాలి మరి.. !
మైనర్ పై లైంగికదాడి కేసు.. సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు !
అప్పుల్లో ఆంధ్ర గట్టెక్కేది ఎట్లా ?
ప్రతి నలుగురిలో ఒకరికి చెవుడు !